పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్..
దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో విశాఖలో భారీ ఫుడ్ సమ్మిట్..
విశాఖపట్నంలో జూలై 9, 10 తేదీల్లో దక్షిణ భారత ప్రాంతీయ “వరల్డ్ ఫుడ్ ఇండియా” సదస్సు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే ఈ సమ్మిట్కు ఆహార ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఎగుమతులు, పెట్టుబడుల రంగాలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రాష్ట్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ఈ కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవుల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో ప్రదర్శనలు, బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) సమావేశాలు, బయ్యర్-సెల్లర్ మీట్లు, థీమాటిక్ సెషన్లు, సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక సాంకేతికతలను పరిచయం చేయడం, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం, ఎగుమతుల అవకాశాలను విస్తరించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యాలుగా నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, రైతులకు విలువ ఆధారిత అవకాశాలు కల్పించడం, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
పాల్గొనే రాష్ట్రాల నుంచి వ్యాపార సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తమ ఉత్పత్తులు, ప్రాసెసింగ్ మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించనున్నాయి. అలాగే పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు భవిష్యత్తులో ఆహార రంగం దిశపై చర్చించనున్నారు.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, దక్షిణాది రాష్ట్రాల మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.
సమ్మిట్ ఏర్పాట్లపై మే 26న కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ జి. విధాధరి అధ్యక్షతన ప్రాథమిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ జి. శేఖర్ బాబు, జనరల్ మేనేజర్ హనుమాన్ నాయక్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సురేందర్ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.