- మారిన ఐటీ నిబంధనలు: నేటి నుంచే పన్నుల గణనలో కొత్త అధ్యాయం ప్రారంభం..
- Business: "ఆరు దశాబ్దాల నిరీక్షణకు తెర": నూతన ఫైనాన్స్ చట్టాన్ని నోటిఫై చేసిన కేంద్రం…
Income Tax: దేశ పన్నుల చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సుమారు ఆరు దశాబ్దాల పాటు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో, సరికొత్త ఐటీ చట్టం నేటి (ఏప్రిల్ 1) నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. పన్ను నిబంధనలలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన ఫైనాన్స్ చట్టాన్ని నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానాన్ని మరింత పారదర్శకంగా, సరళంగా మార్చడమే లక్ష్యంగా ఈ విప్లవాత్మక మార్పులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సామాన్య పన్ను చెల్లింపుదారులకు అర్థమయ్యే రీతిలో నిబంధనలను సరళీకరిస్తూ, పాత చట్టంలోని సంక్లిష్టతలను తొలగించడం ఈ కొత్త చట్టం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఈ నూతన చట్టం ప్రకారం పన్నుల గణనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఉన్న అసెస్ మెంట్ ఇయర్ (Assessment Year), ప్రీవియస్ ఇయర్ (Previous Year) అనే ద్వంద్వ విధానాలకు స్వస్తి పలికి, వాటి స్థానంలో ఒకే 'ట్యాక్స్ ఇయర్' విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది పన్ను చెల్లింపుదారుల గందరగోళాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా, పెట్టుబడిదారులపై ప్రభావం చూపేలా ఎఫ్ అండ్ వో (F&O) ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను ప్రభుత్వం పెంచింది. అయితే, విదేశీ విహార ప్యాకేజీలు, విదేశీ విద్య మరియు వైద్యం కోసం విదేశాలకు పంపే మొత్తంపై పన్నును తగ్గించడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు భారీ ఉపశమనం కలిగించింది.
మరో ముఖ్యమైన మార్పుగా, నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసినప్పటికీ, ఎటువంటి జరిమానా లేకుండా టీడీఎస్ (TDS) రీఫండ్ పొందే వెసులుబాటును కొత్త చట్టం కల్పించింది. ఇక అమలు విషయానికి వస్తే, 2026 జూలైలో దాఖలు చేసే ఐటీఆర్ లు పాత చట్టం ప్రకారమే సమర్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, 2026 జూన్ నుంచి చెల్లించాల్సిన ముందస్తు పన్ను (Advance Tax) మాత్రం ఈ కొత్త చట్టం ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుల పట్ల పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండి, తమ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.