Raghav Chadha vs AAP: ఆమ్ ఆద్మీ పార్టీ లో గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు బహిర్గతమైంది. పార్టీ అగ్ర నాయకత్వానికి, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో కీలక పాత్ర పోషించిన చడ్డాను రాజ్యసభ ఉప పక్ష నేత పదవి నుంచి తప్పించడంతో రాజకీయ సంక్షోభం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేను గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
చడ్డాపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా పలువురు సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేసినప్పుడు రాఘవ్ సహకరించలేదని, ఎన్నికల కమిషనర్పై అభిశంసన తీర్మానానికి దూరంగా ఉన్నారని ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా, రాఘవ్ కీలక రాజకీయ అంశాలను వదిలేసి, సామాన్య విషయాలపై మాత్రమే స్పందిస్తున్నారని, ఇది బీజేపీకి లొంగిపోయారనే అనుమానాలకు తావిస్తోందని సంజయ్ సింగ్, అతిశీ వంటి నేతలు బాహాటంగానే ఆరోపించారు.
ఈ పరిణామాలపై స్పందించిన రాఘవ్ చడ్డా, తనపై వస్తున్న ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తాను పార్టీ లైన్కు కట్టుబడే ఉన్నానని, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తే తాను విపక్షాలతో కలిసి పోరాడిన విషయం స్పష్టమవుతుందని సవాల్ విసిరారు. తీర్మానంపై సంతకం విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని, కేవలం తనను బలిపశువును చేసేందుకే ఈ నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగాలు ప్రజా సమస్యలకు ప్రతిబింబాలని రాఘవ్ గుర్తు చేశారు.
రాఘవ్ చడ్డా వ్యాఖ్యల వెనుక గూఢార్థం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ తనపై క్రమశిక్షణా చర్యల పేరుతో వేధింపులకు పాల్పడుతోందని, దీనిని సహించే ప్రసక్తే లేదని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తనపై చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన తనను ఇప్పుడు కావాలని దూరం పెడుతున్నారన్నది చడ్డా వర్గీయుల ప్రధాన వాదన.
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉన్నాయి. ఒకప్పుడు పార్టీకి ట్రబుల్ షూటర్గా ఉన్న యువ ఎంపీ, ఇప్పుడు పార్టీ అధిష్టానంపైనే తిరుగుబావుటా ఎగురవేయడం గమనార్హం. ఈ అంతర్గత పోరు చివరకు చడ్డా పార్టీ వీడటానికో లేదా కొత్త రాజకీయ సమీకరణాలకో దారితీసే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు సాగుతున్న ఈ రాజకీయ రణం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.