Travel- ఖరేశ్వరం సమీపంలో దర్శనమిచ్చిన చిరుత…
నల్లమల అడవుల్లో పెరిగిన క్రూరమృగాల సంచారం…
ఆదివారం రాత్రి ఘాట్ రోడ్డులో చిరుతపులి హల్చల్…
Leopard: శ్రీశైల పుణ్యక్షేత్రం పరిసరాల్లో మళ్లీ చిరుతపులి సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి (ఏప్రిల్ 12, 2026) శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలోని ఘాట్ రోడ్డులో చిరుతపులి భక్తులకు తారసపడింది. ఈ పరిణామంతో అటు దర్శనానికి వెళ్తున్న భక్తులు, ఇటు తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.
నంద్యాల జిల్లా పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో ఘాట్ రోడ్డుపై ఈ క్రూరమృగం కనిపించింది. దోర్నాల వైపు వెళ్తున్న ప్రయాణికులు రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చిరుతను గుర్తించారు. ప్రాణ భయంతో కొంతసేపు ఆందోళన చెందిన భక్తులు, ఆ తర్వాత ధైర్యం చేసి తమ సెల్ ఫోన్లలో చిరుత సంచారాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీశైలం అటవీ ప్రాంతం (NSTR) కావడం వల్ల వన్యప్రాణుల సంచారం సాధారణమే అయినప్పటికీ, ఘాట్ రోడ్డుపైకి చిరుత రావడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందించారు. భక్తుల భద్రత దృష్ట్యా గస్తీని పెంచామని, ఘాట్ రోడ్డులో రాత్రి వేళల్లో ప్రయాణించే వారు వాహనాలు దిగవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంపులుగా వెళ్లాలని, ఎక్కడా ఆగవద్దని సూచించారు.