సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా మొదలైన చర్చ..
నాది కాదు అనే మనస్తత్వమే ఇక్కడ సమస్య..
ఒక చిన్న సంఘటన పెద్ద చర్చకు దారి తీసింది. కిడ్బియా (Kidbea) సంస్థ వ్యవస్థాపకుడు స్వప్నిల్ శ్రీవాస్తవ్ ఇటీవల ఇండిగో విమాన ప్రయాణంలో ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక X లో పంచుకోవడంతో, సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
విమానంలో తన పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు స్నాక్ తిన్న తర్వాత, చేతిలో ఉన్న చెత్తను సరైన విధంగా ఇవ్వకుండా ముందున్న సీటు కింద ఉద్దేశపూర్వకంగా పెట్టేశాడని స్వప్నిల్ తెలిపారు. కేబిన్ సిబ్బంది చెత్త సేకరణకు వచ్చినప్పటికీ, సీటు కింద ఉన్న ఆ చెత్త కనిపించకుండా మిగిలిపోయిందని చెప్పారు.
“అతను చెత్తను అనుకోకుండా కాదు… జాగ్రత్తగా కింద వేశాడు. విమానం దిగిన తర్వాత కూడా కప్పులు, ఫుడ్ బాక్స్ అలాగే నేలపై ఉండిపోయాయి,” అని ఆయన వివరించారు. “నాది కాదు” అనే మనస్తత్వమే ఇక్కడ సమస్య అని స్పందించాడు.
ఈ ఘటనపై స్పందిస్తూ, ఇది అవగాహన లోపం కాదని, మనస్తత్వ సమస్య అని స్వప్నిల్ అభిప్రాయపడ్డారు. చాలా మంది చదువుకున్నవారైనా, సామాజిక బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
“రోడ్లు, పార్కులు, విమానాలు—ఇవి మనవి కావు, ఎవరో శుభ్రం చేస్తారు అన్న భావన పెరిగిపోయింది. అదే సమస్యకు మూలం,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పోస్ట్ వైరల్ అవడంతో అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. చదువు, ఉద్యోగం ఉన్నా… మంచి ప్రవర్తన, సివిక్ సెన్స్ ఉండాల్సిందే అని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సంఘటన ఒక్కటే కాదు… సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్య మనస్తత్వానికి ఇది ప్రతిబింబమని నెటిజన్లు అంటున్నారు. సివిక్ సెన్స్ అనేది కేవలం మనం చేసే పనుల గురించి మాత్రమే కాదు… తప్పును చూసినప్పుడు స్పందించే బాధ్యత కూడా అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.