లక్షలాది మంది వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు..
వినియోగదారుల తీవ్ర అసహనం..
ఆదివారం ఉదయం దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, వైఫై, ల్యాండ్లైన్ టెలిఫోన్ సేవలు పూర్తిగా పనిచేయకపోవడంతో ఇది కంపెనీ ప్రారంభం నుంచి జరిగిన అతిపెద్ద అంతరాయాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఉదయం నుంచే ఈ సమస్య ప్రారంభమై, దేశంలోని నగరాలు, పట్టణాల్లో వినియోగదారులు ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ లేక పూర్తిగా నిలిచిపోయారు. ఇంతలోనే వినియోగదారులు ఫిర్యాదులు చేయడానికి ఉపయోగించే మై జియో (MyJio) యాప్ కూడా పనిచేయకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఫిర్యాదు చేయడానికి మార్గం లేక వినియోగదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఈ విషయంపై స్పందించిన జియో సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి దేశవ్యాప్తంగా సేవలు నిలిచిపోయిన విషయాన్ని ధృవీకరించారు. సాంకేతిక బృందాలు సమస్య పరిష్కారానికి పని చేస్తున్నాయని, త్వరలోనే సేవలు పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ అంతరాయానికి కారణం ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఈ ఘటనతో సోషల్ మీడియాలో వినియోగదారుల ఆగ్రహం వెల్లువెత్తింది. #JioDown హ్యాష్ట్యాగ్ ట్విట్టర్ (ప్రస్తుతం X)లో ట్రెండ్ అయ్యింది. “యాప్ పనిచేయడం లేదు, వెబ్సైట్ పనిచేయడం లేదు, వైఫై కూడా లేదు… మరి ఏమి పనిచేస్తోంది?” అంటూ ఒక వినియోగదారు ప్రశ్నించగా, మరికొందరు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, చండీగఢ్, పుణే వంటి నగరాల నుంచి కూడా ఇలాంటి సమస్యలనే వెల్లడించారు.
ఇంటర్నెట్ అవుటేజ్లను ట్రాక్ చేసే సంస్థలు కూడా ఈ సమస్య తీవ్రతను ధృవీకరించాయి. నెట్ బ్లాక్స్ (NetBlocks) సంస్థ చండీగఢ్, పంజాబ్, ఒడిశా, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అంతరాయం నమోదైనట్లు తెలిపింది.
దేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులతో జియో అతిపెద్ద టెలికాం నెట్వర్క్. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవలపై కోట్లాది కుటుంబాలు ఆధారపడుతున్నాయి. ఇంటర్నెట్తో పాటు ఫిక్స్డ్ లైన్ కాల్స్ కూడా ఈ సేవల ద్వారానే జరుగుతున్నాయి.
ఇటీవల కూడా ఇలాంటి సమస్యలు ఎదురైన విషయం గుర్తుచేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో జియో సేవలు స్లో అవ్వడం, కనెక్టివిటీ సమస్యలు రావడం వంటి ఫిర్యాదులు వినియోగదారులు చేశారు. అప్పట్లో రీచార్జ్ సిస్టమ్స్ కూడా పనిచేయలేదని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.