ఈ ట్యాపింగ్ బాధితులు రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు సమాచారం. నితీశ్కుమార్, శరద్పవార్, దిగ్విజయ్సింగ్, సీతారాం ఏచూరి (కారత్)తో పాటు రతన్ టాటా వంటి ప్రముఖుల పేర్లు జాబితాలో ఉండటం గమనార్హం.
ఈ అంశానికి సంబంధించిన వాస్తవాలు సమాచార హక్కు (RTI) పిటిషన్ ద్వారా వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది. అప్పటి యూపీఏ పాలనలో ఫోన్ ట్యాపింగ్ నిత్యకృత్యంగా జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. అప్పటి పత్రికల క్లిప్పింగ్స్తో పాటు పాత కథనాలు నెటిజన్లు షేర్ చేస్తుండటంతో ఈ వ్యవహారం మళ్లీ ప్రజల దృష్టికి వచ్చింది.
ఇదిలా ఉండగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే—ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు నిరుద్యోగుల ఆందోళనలు, పరిపాలనా వైఫల్యాలు, అంతర్గత కుమ్ములాటలు… వీటన్నింటికీ తోడు కొత్త కొత్త స్కామ్లు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, తమ పాలనా వైఫల్యాలు, హామీల అమలులో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్కి దిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరింతగా ముందుకు తెచ్చి, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలే ఇందుకు కారణంగా మారాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్రావు, తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిట్ అధికారులు 7 నుంచి 8 గంటల పాటు ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
అయితే, కాంగ్రెస్ తెరమీదికి తెచ్చిన ఈ ‘ట్యాపింగ్ అస్త్రం’ ఇప్పుడు అదే పార్టీకి ఎదురుతిరిగినట్టుగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ హయాంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారాలను గుర్తు చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో “ట్యాపింగ్కు పేటెంట్ రైట్ కాంగ్రెస్దే కదా!” అనే వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తూ, ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది.