సిరియాలో మళ్లీ ఉగ్రవాద ఛాయలు కనిపించడంతో అమెరికా సైన్యం తీవ్రంగా స్పందించింది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా శనివారం ఆకస్మిక గగనతల దాడులు నిర్వహించింది. ఈ దాడులు ‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’లో భాగమని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. సిరియాలోని పలు ప్రాంతాల్లో ఐసిస్ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్న నేపథ్యంలో, ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ మెరుపు దాడులు చేపట్టినట్లు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడులకు ప్రధాన కారణం 2025 డిసెంబర్లో జరిగిన ఘోర ఘటన. పల్మైరా సమీపంలో ఐసిస్ ఉగ్రవాదులు చేసిన ఆకస్మిక దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక పౌర అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది” అని హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకే శనివారం మధ్యాహ్నం అమెరికా గగనతల దళాలు సిరియాలోని ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.
అయితే ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందారు? స్థావరాలకు ఎంత నష్టం జరిగింది? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెలువడలేదు. అమెరికా రక్షణ శాఖ పరిస్థితిని సమీక్షిస్తోందని, పూర్తి నివేదిక త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు, ఈ దాడులు సిరియాలో భద్రతా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా మాత్రం ఐసిస్ను పూర్తిగా తుదముట్టించడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తోంది.
13 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధంతో కుదేలైన సిరియా రాజకీయంగా కీలక మలుపులో నిలిచింది. 2024 డిసెంబర్లో బషర్ అల్-అస్సాద్ పాలన కూలిపోయిన తర్వాత, అహ్మద్ అల్-షరా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు అల్-ఖైదాతో సంబంధాలున్న ఈ బృందాలు ఇప్పుడు ఐసిస్ వ్యతిరేక పోరాటంలో అమెరికాతో చేతులు కలిపాయి. గత ఏడాది షరా వైట్ హౌస్ను సందర్శించి, ఐసిస్ వ్యతిరేక అంతర్జాతీయ కూటమిలో సిరియా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం సిరియాలో సుమారు 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు.