T20 World Cup 2026: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను మట్టికరిపించిన టీమిండియా, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీకొట్టబోతోంది. ఈ ఆదివారం అంటే మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ భారీ పోరు జరగనుంది.
ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా, టైటిల్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా, అలాగే మూడుసార్లు టీ20 కప్పు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించనుంది. సెమీఫైనల్లో సంజూ శామ్సన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) చూస్తుంటే, టీమిండియా బ్యాటర్లు ఫుల్ ఫామ్లో ఉన్నారని అర్థమవుతోంది.
తేదీ: మార్చి 8, ఆదివారం
సమయం: రాత్రి 7:00 గంటలకు
వేదిక: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్
స్ట్రీమింగ్: జియో హాట్స్టార్ యాప్ వెబ్సైట్
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. టికెట్లు 'బుక్ మై షో' ద్వారా అందుబాటులో ఉంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున వెంటనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్టేడియం లోపలికి వెళ్లేటప్పుడు ఒరిజినల్ ఐడీ కార్డు వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు. అలాగే అనధికార వెబ్సైట్ల ద్వారా టికెట్లు కొని మోసపోకండి అని తెలుపుతున్నారు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, తిలక్ వర్మ.
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర.
మరి మన కుర్రాళ్ళు కప్పు కొట్టి ముచ్చటగా మూడవసారి భారతావనిని సంబరాల్లో ముంచుతారో లేదో చూడాలి..