India Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంటేనే ఒక సీరియస్ లుక్, మైదానంలో ఎప్పుడూ కఠినంగా కనిపించే వ్యక్తిత్వం. అలాంటి గంభీర్ను నవ్వించడం అంటే ఆషామాషీ విషయం కాదు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొన్ని సరదా వ్యాఖ్యలు చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్లో భారత్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, గంభీర్ ముఖంలో నవ్వు చూడటానికి తాము ఎంతగా ప్రయత్నించామో వెల్లడించాడు.
గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో క్రమశిక్షణ, గెలుపుపై కసి పెరిగాయన్నది వాస్తవం. అయితే ఆయన ఎప్పుడూ సీరియస్గా ఉండటంపై సోషల్ మీడియాలో తరచూ జోకులు వస్తుంటాయి. దీనిపై సూర్య స్పందిస్తూ.. "వరల్డ్ కప్ జరిగినంత కాలం గౌతీ భాయ్ను నవ్వించడానికి మేం రకరకాలుగా ప్రయత్నించాం. కానీ మా మ్యాచ్లు అన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరగడంతో ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. ఎప్పుడూ ఆటపైనే దృష్టి పెట్టేవారు" అని తెలిపాడు.
చివరికి ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి కప్పు గెలిచిన తర్వాతే గంభీర్ మనస్ఫూర్తిగా నవ్వాడని, ఆ నవ్వు చూసి జట్టు సభ్యులంతా ఎంతో సంతోషించారని సూర్య చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో టీమిండియా భవిష్యత్తు లక్ష్యాల గురించి కూడా సూర్యకుమార్ మాట్లాడాడు. 2024, 2026 ప్రపంచకప్లు గెలిచిన భారత్.. 2028లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ను కూడా గెలిచి 'హ్యాట్రిక్' కొట్టాలని కసిగా ఉందన్నాడు. మేం వరుసగా రెండుసార్లు విజేతలుగా నిలిచాం, మూడోసారి కూడా ఎందుకు గెలవకూడదు? మా లక్ష్యం ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే" అని ధీమా వ్యక్తం చేశాడు.
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడంపై సూర్య హర్షం వ్యక్తం చేశాడు. భారత్ కేవలం ఐసీసీ టోర్నీలే కాకుండా, ఒలింపిక్స్లో కూడా బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాడు. 2024 నుంచి టీమిండియాలో ఒక కొత్త ఉత్సాహం మొదలైందని, వరుసగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలవడం భారత క్రికెట్ స్వర్ణయుగానికి నిదర్శనమని ఆయన కొనియాడాడు. బిసిసిఐ నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య, భారత క్రికెట్ అభిమానులకు ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగుతుందని హామీ ఇచ్చాడు.