తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్థంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటైన ప్రసంగం చేశారు. రాజధాని అంశంపై గత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతూ, “ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధానా? అయితే ఆయన ఎక్కువగా బెంగళూరులో ఉండేవారు కదా, మరి బెంగళూరే రాజధానా?” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐదేళ్ల పాటు మూడు రాజధానుల పేరుతో ప్రజలను అయోమయంలోకి నెట్టారని, ఆ గందరగోళానికి ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఏపీ రాజధానిపై ఇక ఎలాంటి అనిశ్చితి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. “మన రాజధాని అమరావతే. ఇది ప్రజల రాజధాని, భవిష్యత్తు రాజధాని. ఇకపై ఎవరైనా రాజధాని ఏది అని అడిగితే, గర్వంగా ‘అమరావతి’ అని చెప్పాలి” అన్నారు. మూడు రాజధానుల నినాదం తెచ్చిన ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎన్డీయేకు మద్దతిచ్చారని గుర్తు చేశారు. అమరావతిని స్మశానం అన్నవాళ్లే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ను యుగపురుషుడిగా కొనియాడిన చంద్రబాబు, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించిన మహానాయకుడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని తెలిపారు. ఆనాడు రూ.2కే కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీఆర్ బాటలోనే నేడు అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్నామని చెప్పారు. పింఛన్లను రూ.4 వేల వరకు పెంచామని, పేదల కోసం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను సహించబోమని చంద్రబాబు కఠిన హెచ్చరిక చేశారు. రాజకీయ ముసుగులో అరాచకాలు, రౌడీయిజం జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. భూ హక్కులకు భరోసా కల్పిస్తూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేశామని, భూ రికార్డులను బ్లాక్చైన్, క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో భద్రపరుస్తామని తెలిపారు. అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని, 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. కేంద్రంతో సమన్వయంతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు.