మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. తుఫాన్ ప్రభావం సహాయక చర్యల ప్రగతిపై సీఎం ఆర్టీజీఎస్ నుండి విస్తృత సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో ప్రతి శాఖ పనితీరుపై సీఎం స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రభుత్వం వారితోనే ఉండాలి. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలి అని అధికారులను ఆదేశించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు సజావుగా కొనసాగుతున్నాయో లేదో సీఎం ప్రత్యక్షంగా ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు సరిపడిన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు.
అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 249 మండలాలు, 1,400కి పైగా గ్రామాలు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. సుమారు 18 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1.16 లక్షల మందిని 1,200కు పైగా పునరావాస కేంద్రాలకు తరలించారని తెలిపారు.
వ్యవసాయ రంగం ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. 87 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలు నీట మునిగాయని అధికారులు వివరించారు. 78 వేలమంది రైతులు ఈ తుఫాన్ వల్ల నష్టపోయారు.
మౌలిక వసతుల పరంగా కూడా పెద్ద నష్టం వాటిల్లింది. 2,294 కి.మీ. రహదారులు 14 వంతెనలు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. మొత్తం నష్టం విలువ దాదాపు రూ.1,424 కోట్లు గా అంచనా.
చంద్రబాబు నాయుడు ఈ సందర్భంలో మాట్లాడుతూ..
మనం ఎదుర్కొన్న విపత్తు పెద్దదే కానీ, మన ధైర్యం ఇంకా పెద్దది. ప్రతి కుటుంబానికి సాయం చేరాలి. ఒక రైతు కూడా నిరాశ చెందకూడదు. ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేది మన శ్రమే అని అన్నారు.
అంతేకాక గర్భిణీ స్త్రీలు, పిల్లలు సురక్షితంగా ఉన్నారో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే 3,175 మంది గర్భిణీలు సురక్షిత ప్రాంతాలకు తరలించారని, 2,130 మెడికల్ క్యాంపులు నిర్వహించారని సమాచారం.
మొత్తం మీద, మొంథా తుఫాన్ రాష్ట్రానికి గణనీయమైన నష్టం కలిగించినా, ప్రభుత్వం వేగంగా స్పందించి పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. ప్రజల భద్రతే ప్రాధాన్యం అని మరోసారి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.