- మద్యంపై అవగాహన కల్పించేందుకే జాన్వి ఆ కార్యక్రమంలో భాగస్వామి అయిందన్న టీమ్..
- జాన్వీకి మద్యం అలవాటు ఉందనే విధంగా కథనాలు..
Janhvi Kapoor: యువ నటి జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవల మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 'ఆఫ్ ది రాక్స్' మరియు 'అమహా' సంస్థలు నిర్వహించిన ఒక పాడ్క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. జీవితంలోని ఒడిదుడుకులు మరియు మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాటలను సందర్భం లేకుండా వాడుకుంటూ, జాన్వీకి మద్యం అలవాటు ఉందనే తప్పుడు అర్థం వచ్చేలా కథనాలు ప్రసారం చేయడం పట్ల ఆమె వ్యక్తిగత బృందం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చింది.
ఈ వివాదంపై స్పందించిన సదరు పాడ్క్యాస్ట్ సంస్థలు కూడా జాన్వీ కపూర్కు మద్దతుగా నిలిచాయి. ఆమె కేవలం సామాజిక బాధ్యతతో వ్యసనాలపై అవగాహన కల్పించేందుకే ఆ కార్యక్రమంలో భాగమయ్యారని, అంతకుమించి ఆమె వ్యక్తిగత అలవాట్లకు సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థలు స్పష్టం చేశాయి. తన అనుభవాలను పంచుకోవడం వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి, అవాస్తవాలను వైరల్ చేయడం అత్యంత బాధాకరమని జాన్వీ టీమ్ పేర్కొంది. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, క్లిక్ బైట్ కథనాల కోసం సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని కించపరచవద్దని వారు కోరారు.
జాన్వీ కపూర్ స్వయంగా ఈ విషయంలో స్పందిస్తూ, పాడ్క్యాస్ట్ సంస్థలు విడుదల చేసిన వివరణాత్మక నోట్ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "వాస్తవాలు తెలుసుకోండి.. అవాస్తవాలను ప్రచారం చేయకండి" అంటూ ఆమె ఘాటుగా సమాధానమిస్తూ అసత్య ప్రచారాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె తన వృత్తిపరమైన జీవితంపై దృష్టి సారిస్తూ, తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ పరిణామంపై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.