37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ వేదికపై శిక్షణ..
నేడు ప్రపంచ విద్యార్థులు.. రేపటి తరానికి మార్గదర్శకులు..
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో కొత్త దశ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు, బోధనా నాణ్యతను కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాల్లో శిక్షణకు పంపుతూ ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
2025లో ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ అందుకున్న 37 మంది టీచర్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా “ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్” చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు గ్లోబల్ స్థాయి బోధనా పద్ధతులను నేర్చుకుని, రేపటి తరానికి మార్గదర్శకులుగా ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఫ్యూచర్ రెడీ’ విజన్తో శ్రీకారం చుట్టగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న విద్యార్థులతోనైనా పోటీ పడగల సామర్థ్యం రాష్ట్ర విద్యార్థుల్లో రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వారు చెబుతున్నారు.
సింగపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మే 4 నుంచి 8 వరకు ఐదు రోజులపాటు జరుగుతున్న ఈ శిక్షణా కార్యక్రమంలో 37 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. “డిజైనింగ్ లెర్నింగ్ - ఇన్స్పైరింగ్ థింకింగ్” అనే అంశంపై శిక్షణ అందిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ తరగతుల్లో విద్యా విధానం, ఇన్స్ట్రక్షనల్ డిజైన్, క్రిటికల్ థింకింగ్, ఫెసిలిటేషన్ స్కిల్స్ వంటి అంశాలపై ఉపాధ్యాయులు లోతుగా నేర్చుకుంటున్నారు.
ఇదే సమయంలో సింగపూర్లోని యిషున్ సెకండరీ స్కూల్ ను సందర్శిస్తూ అక్కడి డిజిటల్ బోధనా విధానాలు, తరగతి గది నిర్వహణను ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తున్నారు.
ఈ బృందం ఎంపికలో ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చింది. రాజకీయాలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరిపింది. 10 మంది హెడ్మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 4 మంది ప్రిన్సిపాళ్లు, 5 మంది ఫిజికల్ డైరెక్టర్లు ఎంపికయ్యారు. వీరిలో 17 మంది మహిళలు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సింగపూర్ పర్యటనతో పాటు, ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానానికి పేరుగాంచిన యూనివర్సిటీ ఆఫ్ టుర్కు లో శిక్షణ కోసం మరో 29 మంది ఉపాధ్యాయులను పంపేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఈ శిక్షణ కేవలం పర్యటనకే పరిమితం కాకుండా, ఉపాధ్యాయులు తిరిగి వచ్చిన తరువాత తమ పాఠశాలల్లో “పోస్ట్ ట్రైనింగ్ యాక్షన్ ప్లాన్” అమలు చేస్తారు. ఇతర టీచర్లకు మెంటర్లుగా మారి, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను గ్రామీణ స్థాయికి తీసుకెళ్తారు.
సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “ఈ శిక్షణ విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పుకు నాంది. సింగపూర్లో నేర్చుకున్న పద్ధతులు రాష్ట్రంలోని తరగతి గదులను ఫ్యూచర్ రెడీగా మారుస్తాయి” అని చెప్పారు. ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంచడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.