వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు మరింత సులభం కావడానికి ‘ఫాస్టాగ్ వార్షిక పాస్’ను ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రత్యేకంగా జాతీయ రహదారుల్లో తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఈ పాస్ మంచి ఉపశమనం అవుతుంది.
ఈ వార్షిక పాస్ ధర రూ. 3,000గా నిర్ణయించారు. ఈ పాస్ కొనుగోలు చేసిన ప్రైవేట్ వాహన యజమానులు, కార్లు, జీపులు, వ్యాన్లకు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ సౌకర్యం వాణిజ్య వాహనాలకు వర్తించదు.
ఫాస్టాగ్ యాక్టివ్ ఉన్న వాహనాల యజమానులు ‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్ లేదా NHAI అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనించవలసింది ఏమంటే, ఈ పాస్ కేవలం NHAI, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని మార్గాల్లో ఇది పనిచేయదు. అలాంటి మార్గాల్లో ప్రయాణించేటప్పుడు సాధారణ ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము కట్ అవుతుంది.
ఒకసారి తీసుకున్న పాస్ను మరో వాహనానికి బదిలీ చేయలేరు. 200 ట్రిప్పులు లేదా ఏడాది గడువు ముగిసిన తర్వాత పాస్ గడువు ముగుస్తుంది. పునఃదరఖాస్తు చేసుకోవాలి. ఈ పాస్కు ఆటో-రెన్యూవల్ లేదు.