Politics- హర్యానాలో భారత్ తొలి హైడ్రోజన్ రైలు సర్వీసులు.. రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్!
ఆగస్టు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న స్వదేశీ హైడ్రోజన్ రైలు!
పొగకు బదులు నీటి ఆవిరి మాత్రమే.. పర్యావరణ హితంగా భారత తొలి హైడ్రోజన్ రైలు!
Hydrogen Train: భారతీయ రైల్వే రవాణా రంగంలో ఒక సరికొత్త చరిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత గ్రీన్ ‘హైడ్రోజన్ రైలు’ను పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడవబోయే ఈ సరికొత్త రైలు కమర్షియల్ సర్వీసుల ప్రారంభానికి రైల్వే బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విజయవంతమైతే, ప్రపంచంలోనే హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న జర్మనీ, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ కూడా నిలవనుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బ్రాడ్ గేజ్ ట్రాక్పై నడిచే అత్యంత శక్తివంతమైన రైలుగా దీనిని రూపొందించడం విశేషం.
మొత్తం 10 కోచ్లతో రూపొందించిన ఈ గ్రీన్ రైలులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది సాధారణ ప్యాసింజర్ కోచ్లు ఉంటాయి. జింద్-సోనిపట్ రూట్లో గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ రైలు వేగంగా వేగాన్ని అందుకోవడానికి, అలాగే వెంటనే వేగాన్ని తగ్గించడానికి వీలుగా ‘డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్’ సాంకేతికతను ఉపయోగించారు. బ్రాడ్ గేజ్ ట్రాక్ పై నడిచే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇదే కావడం గమనార్హం.
ఈ రైలు నిర్వహణ కోసం హర్యానాలోని జింద్లో అధునాతన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, వాటర్ ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా పర్యావరణ హిత ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఈ రైలు మెయింటెనెన్స్ కోసం ఢిల్లీకి తరలించే సమయంలో భద్రతా నిబంధనల ప్రకారం హైడ్రోజన్ పవర్ సిస్టమ్ ఆపేసి డీజిల్ ఇంజన్ సహాయంతో లాగుతారు. సాంప్రదాయ డీజిల్ రైళ్లతో పోలిస్తే ఈ హైడ్రోజన్ రైళ్లు ఎలాంటి హానికర వాయువులను విడుదల చేయవు. కెమికల్ రియాక్షన్ ద్వారా విద్యుత్ తయారయ్యాక, ఈ రైలు సైలెన్సర్ నుండి కాలుష్య పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే పర్యావరణంలోకి విడుదలవుతుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) నుండి అన్ని రకాల క్లియరెన్సులు లభించాయి. మొదటి మూడు నెలల పాటు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే తక్షణమే స్పందించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన టెక్నికల్ గ్రూప్ నిరంతరం ఈ రైల్లోనే ప్రయాణించనుంది. ప్రస్తుతం తుది తనికీలు మరియు లోకో పైలట్ల శిక్షణ ముగింపు దశకు చేరుకున్నాయి. రాబోయే ఆగస్టు నాటికి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ఈ హైడ్రోజన్ రైలు విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని మార్గాల్లో ఇలాంటి గ్రీన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది కేవలం రైల్వే ప్రయాణాన్ని మార్చడమే కాకుండా దేశంలో కాలుష్య నివారణకు ఎంతో దోహదపడుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేలా ఈ ప్రాజెక్ట్ నిలవనుంది. దేశ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికే ఈ ప్రయాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.