రాష్ట్రంలోని సామాన్యులకు, ఉద్యోగులకు త్వరలోనే తిండి కష్టాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ మేఘాలు ఇప్పుడు మన వంటిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ (LPG) సరఫరా నిలిచిపోవడంతో తెలంగాణలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. దీనివల్ల రాబోయే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందని తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ హెచ్చరించింది.
ప్రస్తుతం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న హోటళ్ల వద్ద కేవలం ఒకటి లేదా రెండు రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేసి, కేవలం డొమెస్టిక్ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించడంతో హోటల్ రంగం కుదేలైంది. మేము ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు, చిన్న మధ్య తరహా హోటళ్లు గ్యాస్ లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయి అని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రభావం కేవలం హోటళ్లకే పరిమితం కాకుండా, నగరంలోని వేలాది హాస్టళ్లపై కూడా పడనుంది. ఇప్పటికే కొన్ని హాస్టళ్లలో టీ, కాఫీ వంటి అదనపు సౌకర్యాలను నిలిపివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో హాస్టళ్లను కూడా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. బయట తినే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బ్యాచిలర్లు ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.
మరోవైపు ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క హైదరాబాద్లోనే మధ్య తరహా హోటళ్లు వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. హోటళ్లు మూతపడితే గిగ్ వర్కర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఆదాయం కోల్పోతారు. కొన్ని చోట్ల హోటల్ యజమానులు గ్యాస్ లేక తిరిగి పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలపై వంట చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే, రాష్ట్రంలో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు కూడా గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని, బయట హోటళ్లపై ఆధారపడే వారు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచిస్తున్నారు.