8 విభాగాలపై నేడు కలెక్టర్లతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
సీఎం చంద్రబాబుకు ప్రజంటేషన్ ఇవ్వనున్న అధికారులు..
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు సమావేశం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక విభాగాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఈరోజు మొత్తం 8 ప్రధాన విభాగాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా “స్వర్ణాంధ్ర విజన్ 2024”లో భాగంగా డీప్ టెక్, సూపర్ సిక్స్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రెవెన్యూ, ఆదాయ వనరుల పెంపు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ అంశాలపై అధికారులు సమగ్ర ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
మధ్యాహ్నం తర్వాత న్యాయ విభాగం, శాంతి భద్రతలపై సమీక్ష కొనసాగనుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించనున్నారు.
సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో కలిసి ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో చర్చించిన అన్ని అంశాలను సమీక్షించి, అధికారులకు మరియు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ఈ సమావేశం కీలక వేదికగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.