2019లో టీడీపీ హయాంలో కేంద్రం రైల్వేజోన్ ప్రకటించింది..
జోనల్ ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని కేంద్రం కోరినా పట్టించుకోలేదు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైల్వేజోన్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం రైల్వేజోన్ను ప్రకటించిందని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిందని ఎంపీ భరత్ విమర్శించారు.
రైల్వేజోన్ ఏర్పాటు కోసం అవసరమైన జోనల్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని కేంద్రం పలుమార్లు కోరినా, అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో ఈ కీలక ప్రాజెక్టును గాలికొదిలేసి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రైల్వేజోన్ విషయాన్ని గుర్తు చేసుకోవడం వైసీపీ వైఖరిని బయటపెడుతుందని విమర్శించారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఊతమని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలు ముందుకు సాగుతున్నాయని, సిరిపురం జంక్షన్ డెక్ ఆఫీస్లో తాత్కాలిక జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జూన్ 1 నుంచి ఈ జీఎం కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. రైల్వేజోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.