గ్రాట్యుటీ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
సొంత భవనాల దిశగా అడుగులు
ముస్తాబుతో మారిన రూపురేఖలు
AP Assembly Updates: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కార్యకర్తల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గురువారం అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు సమాధానమిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వారి కష్టాన్ని గుర్తించే నిర్ణయాలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అంశంపై మంత్రి సానుకూల ప్రకటన చేశారు. 62 ఏళ్లు దాటి పదవీ విరమణ పొందే అంగన్వాడీలకు ఖచ్చితంగా గ్రాట్యుటీ అందజేస్తామని హామీ ఇచ్చారు. గతంలో అంగన్వాడీలు చేసిన 10 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 9 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని, మిగిలి ఉన్న ఆ ఒక్క కోరికను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని సభ సాక్షిగా వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు సార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 55,700 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. అయితే వీటిలో సుమారు 23,400 కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, దీనివల్ల పిల్లలకు కొంత ఇబ్బంది కలుగుతోందని ఆమె అంగీకరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, ప్రస్తుతం సుమారు 3,000 కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలను పూర్తి చేసి, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు.
కేంద్రాల ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం 'ముస్తాబు' అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. గోడలకు రంగులు వేయడం, పిల్లలకు ఆట వస్తువులు సమకూర్చడం వంటి పనుల వల్ల కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని అన్నారు. ఈ మార్పుల వల్ల అంగన్వాడీలకు వచ్చే పిల్లల హాజరు శాతం కూడా గణనీయంగా పెరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
చిన్నారుల ఆరోగ్యమే ప్రధానంగా ప్రభుత్వం పనిచేస్తోందని సంధ్యారాణి గారు పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆహారం పంపిణీలో ఎక్కడా అవకతవకలు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని, ప్రతీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు.