సౌర విద్యుత్, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు.. గ్రీన్ స్టేషన్గా సికింద్రాబాద్…
విమానాశ్రయంలా మారనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్…
రూ. 700 కోట్లతో భాగ్యనగరం నడిబొడ్డున వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్…
Indian Railways: దక్షిణ మధ్య రైల్వే జోన్లో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలో సరికొత్త రూపంలో దర్శనమివ్వనుంది. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'అమృత్ భారత్' పథకంలో భాగంగా ఈ స్టేషన్ను అంతర్జాతీయ విమానాశ్రయం (ఎయిర్పోర్ట్) తరహాలో పునర్నిర్మిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్ను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంటే 2060 నాటికి రోజుకు 2.75 లక్షల మంది ప్రయాణికులు వచ్చినా తట్టుకునేలా ఆధునీకరిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసి స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఆధునీకరణలో భాగంగా స్టేషన్లో అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రయాణికులు సులభంగా ప్లాట్ఫారమ్లకు చేరుకునేలా 32 ఎస్కలేటర్లు, లిఫ్ట్లు మరియు 26 ట్రావెలైటర్లను (నడిచే దారి) ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు పిల్లలకు ఇబ్బంది లేకుండా నాలుగు భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. ప్లాట్ఫారమ్ నంబర్ 10 వైపు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి, అలాగే ప్లాట్ఫారమ్ నంబర్ 1 వైపు కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్టేషన్ భవనం అద్దాలతో కూడిన ఆధునిక హంగులతో ప్రయాణికులకు విదేశీ అనుభూతిని కలిగించనుంది.
సికింద్రాబాద్ స్టేషన్లో ఎప్పటి నుంచో ఉన్న అతిపెద్ద సమస్య పార్కింగ్. దీనికి పరిష్కారంగా స్టేషన్కు ఇరువైపులా (ఉత్తరం మరియు దక్షిణం) మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఉత్తరం వైపు 400 వాహనాలు, దక్షిణం వైపు 200 వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు నేరుగా మెట్రో స్టేషన్లు మరియు బస్ స్టేషన్లకు చేరుకోవడానికి 9 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకమైన 'స్కై వాక్'ను కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు బయటి ట్రాఫిక్తో సంబంధం లేకుండా సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
పర్యావరణ హితం కోసం ఈ స్టేషన్లో 5000 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అలాగే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని 100కు పైగా ఈవీ (EV) ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేశారు. స్టేషన్ లోపల ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, విశాలమైన కాన్కోర్స్ ఏరియాలను నిర్మిస్తున్నారు. ప్రయాణికులు నేరుగా మొదటి అంతస్తుకు చేరుకుని, అక్కడ ఉన్న కాన్కోర్స్ ద్వారా తమకు కావాల్సిన ప్లాట్ఫారమ్కు వెళ్లేలా వర్టికల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశారు.