Dharmavaram Land Scam: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార బలంతో ధర్మవరం చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ ఫామ్ హౌస్, గుర్రాల కోట చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఈ అక్రమాలకు అప్పట్లో రెవెన్యూ అధికారులు కూడా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆయన పరం చేసేందుకు సహకరించారని విచారణలో తేలింది. ముఖ్యంగా నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో ఈ 'గుర్రాల కోట' వెనుక ఉన్న అసలు రంగును బయటపెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సుమారు 20 ఎకరాల ధర్మవరం చెరువు భూమిని ఆక్రమించి కేతిరెడ్డి అక్కడ విలాసవంతమైన ఫామ్ హౌస్, గుర్రాల కోసం ప్రత్యేక కోట, బోటింగ్ వంటి సౌకర్యాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. తుంపర్తికి చెందిన పరమేష్ అనే వ్యక్తి ఈ అక్రమ కట్టడాలపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది. చెరువు భూమిని కబ్జా చేసి పర్యావరణానికి విఘాతం కలిగించారని, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆధారాలతో సహా గ్రీన్ ట్రిబ్యునల్కు వివరించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆక్రమణలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ భూ కుంభకోణంలో కేతిరెడ్డికి అండగా నిలిచిన రెవెన్యూ అధికారులపై ఇప్పుడు ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. అప్పట్లో పనిచేసిన ఎమ్మార్వో యుగేశ్వరీదేవి వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని తేలింది. కేతిరెడ్డి నిర్మించిన ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 661లో (చెరువు భూమి) ఉన్నప్పటికీ, అది సర్వే నెంబర్ 904లో ఉందని ఆమె రికార్డుల్లో తప్పుగా చూపించారు. ఇలా ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చిత్రీకరించి ఎమ్మెల్యే అక్రమాలకు ఆమె పూర్తిస్థాయిలో సహకరించారని విచారణలో వెల్లడైంది.
మరోవైపు, ఎమ్మార్వో నీలకంఠారెడ్డి కూడా నిబంధనలను తుంగలో తొక్కి కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు మేలు చేశారని అధికారులు గుర్తించారు. ఆఫీసు రికార్డులను కనీసం సరిచూసుకోకుండానే, కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో సుమారు 2.42 ఎకరాల అసైన్డ్ భూమిని వెబ్ ల్యాండ్లో నమోదు చేశారు. ఇలా అర్హత లేని వ్యక్తులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యం వహించి, తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు గాను సి.ఎస్ సాయిప్రసాద్ ఆ ఇద్దరు ఎమ్మార్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం ఈ భూ ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వం 10 రోజుల గడువు ఇచ్చింది. అక్రమంగా నిర్మించిన ఆ గుర్రాల కోటపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, వారికి సహకరించిన రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వివాదం చివరకు కేతిరెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేతకు దారితీస్తుందా లేదా అనేది వేచి చూడాలి.