25 కొత్త పాలసీలతో 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం…
పేదల సొంతింటి కలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన…
5 లక్షల మందికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్…
AP Development: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 25 నూతన పాలసీలను తీసుకువచ్చామని, దీని ద్వారా సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడమే కాకుండా 23 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని ఆయన ప్రకటించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే 'సర్క్యులర్ ఎకానమీ' వంటి వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నామని తెలిపారు. వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తూ, కేసుల పరిష్కారానికి పదివేల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణం కుంటుపడిందని సీఎం విమర్శించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 20 నెలల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 4,998 కిలోమీటర్ల సి.సి. రోడ్లను పూర్తి చేశామని గర్వంగా చెప్పారు. 'పల్లె పండుగ', 'అడవి తల్లి బాట' వంటి కార్యక్రమాలతో గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా 9 కోట్ల పనిదినాలను కల్పిస్తూ, గ్రామాల అభివృద్ధికి గోశాలలు, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని పేర్కొన్నారు.
సామాజిక అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, సోషల్ మీడియాలో పెరుగుతున్న విచ్చలవిడితనంపై ఆందోళన వ్యక్తం చేశారు. మన పిల్లల భవిష్యత్తు పాడవకుండా ఉండేందుకు 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేశామని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అనుమతితో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మహిళా సాధికారత మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చంద్రబాబు వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి, రాబోయే ఉగాది నాటికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తున్నామని, యోగా మరియు నేచురోపతి వంటి విధానాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తామని తెలిపారు.