Eluru District News: ఏలూరు జిల్లాలోని కట్రానిపాడు గ్రామం ఆ ఊరి పేరు వింటేనే వర్షాకాలంలో అక్కడి జనం వణికిపోయేవారు. గడిచిన అరవై ఏళ్లుగా ఆ గ్రామస్తులు ఒకే సమస్యతో సహవాసం చేస్తున్నారు. వాన పడితే చాలు, పక్కనే ఉన్న కొండవాగు ఉప్పొంగి గ్రామాన్ని చుట్టుముట్టేది. రోడ్లన్నీ చెరువుల్లా మారి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. పిల్లలు బడికి వెళ్లాలన్నా, రైతులు పండించిన పంటను అమ్ముకోవాలన్నా ఆ వాగు దాటడం ప్రాణసంకటంగా ఉండేది. ఇక ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లడం గగనమయ్యేది.
అధికారుల చొరవ.. నేతల అండ
దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు, ప్రజాప్రతినిధులు గట్టిగా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కొలుసు పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పట్టిసీమ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న స్లూయిస్ గేట్లను ఇక్కడ వినియోగించుకోవాలని ఒక వినూత్న ఆలోచన చేశారు. దీనికి ప్రభుత్వం నుండి అనుమతులు రావడంతో పనులు వేగవంతమయ్యాయి.
రూ. 55 లక్షల ప్రజా ధనం ఆదా
సాధారణంగా అక్కడ కొత్తగా కల్వర్టులు నిర్మించాలంటే భారీగా ఖర్చవుతుంది. కానీ పట్టిసీమ నుంచి తెచ్చిన స్లూయిస్ గేట్లను కల్వర్టులు అవసరమైన నాలుగు కీలక ప్రాంతాల్లో అమర్చారు. దీనివల్ల దాదాపు రూ. 55 లక్షల వరకు ప్రజా ధనం ఆదా అయ్యింది. పాత సామాగ్రిని ఇలా ప్రత్యామ్నాయంగా వాడి సమస్యను పరిష్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ అధికారులు కూడా ఈ పద్ధతిని సమర్థంగా అమలు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చారు.
చేయూతనిచ్చిన దాతలు.. గ్రామస్తుల కృతజ్ఞతలు
ఈ భారీ స్లూయిస్ గేట్లను బాలివే నుంచి గ్రామానికి తరలించడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమయంలో రాపర్ల మురళి ఆర్థిక సాయం అందించి రవాణా ఇబ్బందులను తొలగించారు. అలాగే బొమ్మకంటి శ్యామలరావు తన అనుభవంతో సరైన మార్గదర్శకత్వం చేయగా, రాపర్ల ప్రతాప్ పనుల పర్యవేక్షణలో తోడ్పడ్డారు. వీరి ఉమ్మడి కృతజ్ఞతతోనే ఇన్నేళ్ల సమస్యకు ఇప్పుడు తెరపడిందని గ్రామస్తులు ఆనందంగా చెబుతున్నారు. తమ కష్టాన్ని గుర్తించి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఊరి జనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఊపిరి పీల్చుకున్న కట్రానిపాడు
ప్రస్తుతం ఆ నాలుగు ప్రాంతాల్లో స్లూయిస్ గేట్ల ఏర్పాటు పూర్తి కావడంతో వాగు నీరు రోడ్లపైకి రాకుండా సాఫీగా వెళ్లే మార్గం ఏర్పడింది. "ఇప్పుడు మా పిల్లలు భయం లేకుండా బడికి వెళ్తున్నారు. అత్యవసరమైతే ఆసుపత్రికి వెళ్లే దారి దొరికింది" అని స్థానికులు సంబరపడుతున్నారు. అరవై ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకడమే కాకుండా, ప్రజా ధనాన్ని ఆదా చేస్తూ చేసిన ఈ ప్రయత్నం చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.