ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ మరో చరిత్రాత్మక ఘనత సాధించింది. బియ్యం ఉత్పత్తిలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. తాజా గణాంకాల ప్రకారం భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులకు పరిమితమైందని మంత్రి వెల్లడించారు. ఈ విజయం దేశ వ్యవసాయ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే ఘట్టంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) రూపొందించిన 25 రకాల పంటలకు చెందిన 184 కొత్త వంగడాలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. దిగుబడులు పెంచే ఆధునిక విత్తనాల అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు వేసిందని తెలిపారు. ముఖ్యంగా బియ్యం ఉత్పత్తిలో అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత సాధించడంలో ఈ కొత్త వంగడాలు కీలక పాత్ర పోషించనున్నాయని అన్నారు. రైతులకు వీటి ప్రయోజనం త్వరగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
దేశాన్ని ఆహార రంగంలో పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చౌహాన్ స్పష్టం చేశారు. ఇందుకు బియ్యంతో పాటు పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పెంపుపై మరింత దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 11 ఏళ్ల పాలనలో 3,236 అధిక దిగుబడినిచ్చే వంగడాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఈ వంగడాలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు బలమైన పునాది వేస్తాయని ఆయన అన్నారు.
వాతావరణ మార్పులు, కరవు పరిస్థితులు, నేలల లవణీయత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనేలా ఈ కొత్త వంగడాలను అభివృద్ధి చేసినట్లు మంత్రి వివరించారు. ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన భారత్, నేడు ప్రపంచ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం వెనుక ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషి ఉందని చౌహాన్ ప్రశంసించారు. భారత్ వ్యవసాయ రంగంలో సాధించిన ఈ ఘనత భవిష్యత్తులో మరింత పురోగతికి దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.