ఇచ్చిన మాట ప్రకారం రూ. 4 వేలకు పింఛన్ పెంపు…
నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న బీసీ జనార్దన్ రెడ్డి…
రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి పింఛన్లు…
Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం బనగానపల్లె పట్టణంలోని బీసీ కాలనీలో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లారు. రేపు ఒకటో తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీని చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా అవ్వాతాతలకు పింఛన్ డబ్బులు అందజేసి, వారి యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచిందని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమమే పరమావధిగా సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేవలం 20 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రంలో పింఛన్ల కోసం సుమారు 60 వేల కోట్ల రూపాయల సంక్షేమ ఫలాలను అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది దేశంలోనే మరే రాష్ట్రంలో లేని రికార్డు అని ఆయన కొనియాడారు.
పింఛన్ల పంపిణీ సమయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక ప్రజలతో ముఖాముఖి చర్చించారు. కాలనీలోని మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా స్వీకరిస్తూ, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ. 2,725 కోట్ల పింఛన్లను క్రమం తప్పకుండా అందిస్తున్నామని మంత్రి వివరించారు. లబ్ధిదారుల సౌకర్యార్థం ఒకేసారి మూడు నెలల పింఛన్ తీసుకునే వెసులుబాటును కూడా కల్పించామని, ఇది పేదలకు ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. అలాగే, గతంలో నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు 'స్పౌజ్ పెన్షన్లు' (భార్య లేదా భర్త చనిపోయినప్పుడు వచ్చే పింఛన్) కేవలం ఒక్క నెల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.