- సీఎం చంద్రబాబు ఆశ్చర్యం.. గతాన్ని ప్రశ్నిస్తూ..
- అభివృద్ధికి సీఎం భరోసా
Chandrababu meets Kadapa MLAs: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కడప జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలతో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశం రాజకీయంగా, అభివృద్ధి పరంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో జిల్లాలోని పెండింగ్ సమస్యలు, గత ప్రభుత్వ వైఫల్యాల గురించి నేతలు ముఖ్యమంత్రికి వివరించారు.
సమావేశంలో పాల్గొన్న కడప జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని దీర్ఘకాలిక సమస్యలను సీఎం ముందు ఉంచారు. జిల్లాలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడిని నివారించాలని, సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ పనులు, ఇతర పెండింగ్ పనుల జాబితాను అందజేశారు. గత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని నేతలు ప్రస్తావించారు.
జిల్లాలోని అసంపూర్తి పనులు, చెల్లించని బిల్లుల వివరాలు విన్న చంద్రబాబు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి కూడా గత ముఖ్యమంత్రి ఏమీ చేయకపోవడం నమ్మశక్యం కావడం లేదు. జిల్లాపై అంతటి నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రజల నుంచి అంతటి వ్యతిరేకత వచ్చిందని అర్థమవుతోంది.” కడప జిల్లా వాసులకు చంద్రబాబు హామీ ఇస్తూ, జిల్లాలోని ప్రతి సమస్యా తన దృష్టిలో ఉందని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు.
ఆగిపోయిన పనులకు సంబంధించి నిధుల విడుదలపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.మధ్యలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా కడప జిల్లాను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ జిల్లా నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత జిల్లాలో అభివృద్ధి జరగలేదన్న విమర్శల నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వేచి చూడాలి.