2026 నూతన సంవత్సర కానుకగా కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం (డీఏ) పెంపుపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం అమలైతే దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిసెంబర్ 2025 నాటి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) గణాంకాల ప్రకారం డీఏ లెక్కింపు 60.34 శాతానికి చేరుకుంది. నిబంధనల ప్రకారం దశాంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో, డీఏను 60 శాతంగా ఖరారు చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 58 శాతం డీఏ అందుతోంది. తాజా లెక్కల ప్రకారం దీనిని మరో 2 శాతం పెంచే ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుంచే అమలులోకి రానుంది. మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ డీఏ పెంపుకు అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. దీంతో మార్చి నెలలో ఉద్యోగులకు ‘డబుల్ బొనాంజ’ దక్కనుంది. పెరిగిన డీఏతో పాటు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన బకాయిలు కూడా మార్చి జీతంతో పాటే ఖాతాల్లో జమ కానున్నాయి.
డీఏ పెంపు వల్ల జీతాల్లో వచ్చే మార్పు ఎలా ఉంటుందంటే.. ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.50,000 అనుకుంటే, ప్రస్తుత 58 శాతం డీఏ ప్రకారం నెలకు రూ.29,000 కరువు భత్యం పొందుతున్నారు. డీఏ 60 శాతానికి పెరిగితే ఈ మొత్తం రూ.30,000కు చేరనుంది. అంటే నెలకు అదనంగా రూ.1,000 లాభం ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల అరియర్స్ కూడా కలిపితే మార్చి నెలలో ఉద్యోగుల చేతికి భారీగా నగదు అందే అవకాశం ఉంది. తక్కువ బేసిక్ పే ఉన్న ఉద్యోగులకు కూడా ఈ పెంపు కొంత ఊరటనిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగిసిన నేపథ్యంలో, డీఏ పెంపుపై ఉద్యోగుల్లో మరింత ఆసక్తి నెలకొంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 60 శాతం డీఏను భవిష్యత్తులో కొత్త బేసిక్ జీతంలో విలీనం చేసే అవకాశం ఉండటంతో, ఈ 2 శాతం పెరుగుదల ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లెక్కింపులో కీలక పాత్ర పోషించనుంది. అందుకే ఈ డీఏ పెంపును ఉద్యోగులు కేవలం తాత్కాలిక లాభంగా కాకుండా, భవిష్యత్ ఆర్థిక భద్రతకు కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.