మత్స్యకారులకు రూ.20 వేల వేట నిషేధ భృతి అందిస్తున్న కూటమి ప్రభుత్వం..
డీజిల్ సబ్సిడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ: అచ్చెన్నాయుడు..
అమరావతి: మత్స్యకారుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తట్టుకోలేక వైసీపీ నేతలు విష ప్రచారానికి దిగుతున్నారని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేక అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు.
మత్స్యకారుల ఖాతాల్లో కోట్ల రూపాయల సంక్షేమ నిధులు నేరుగా జమ అవుతున్నా, వాటిని వక్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లడం వైసీపీకి అలవాటైందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో మత్స్యకారులను కేవలం ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్నవారే ఇప్పుడు వారిపై ప్రేమ చూపిస్తున్నట్లు నటించడం రాజకీయ డ్రామా తప్ప మరొకటి కాదన్నారు. మత్స్యకారుల సంక్షేమంపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లాభం పొందాలని చూస్తున్న వారికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ప్రతి సంవత్సరం సముద్ర జీవ సంపద పరిరక్షణ కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధ కాలం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. గతంలో కేవలం బియ్యం పంపిణీతో సరిపెట్టారని, తెలుగుదేశం ప్రభుత్వం 2014-15లో రూ.2 వేల నగదు సహాయం, 2016-18 మధ్య రూ.4 వేల భృతి అందించిందని గుర్తు చేశారు.
2019లో వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచినట్లు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రూ.20 వేలకు పెంచి మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచిందని అచ్చెన్నాయుడు చెప్పారు. మోటారు లేని పడవల యజమానులు, సిబ్బందిని కూడా పథకం పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు.
2025-26 సంవత్సరంలో 1,21,433 మత్స్యకార కుటుంబాలకు రూ.242.866 కోట్ల భృతి చెల్లించామని మంత్రి వెల్లడించారు. 2026-27 సంవత్సరానికి 1,52,248 మంది మత్స్యకారులను గుర్తించి, అందులో 1,30,796 మందికి భృతి చెల్లింపుల కోసం సిఫార్సు చేశామని చెప్పారు. ఇందుకోసం రూ.261.592 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.254.886 కోట్లు విడుదలయ్యాయని వివరించారు.
డీజిల్ సబ్సిడీపై కూడా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. 2018-19 వరకు లీటరుకు రూ.6.03 మాత్రమే సబ్సిడీ ఉండేదని, 2019 నుంచి దాన్ని రూ.9కు పెంచినట్లు తెలిపారు. మోటరైజ్డ్ పడవలకు నెలకు 300 లీటర్లు, మెకనైజ్డ్ పడవలకు నెలకు 3000 లీటర్ల వరకు, సంవత్సరానికి 10 నెలల పాటు సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. HSD స్మార్ట్ కార్డుల ద్వారా కొనుగోలు సమయంలోనే నేరుగా సబ్సిడీ అందే విధంగా పారదర్శక వ్యవస్థను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 98 HSD అవుట్లెట్లు, అందులో 8 AFCOF అవుట్లెట్ల ద్వారా సబ్సిడీ డీజిల్ అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం 21,093 చేపల వేట పడవలు ఈ సబ్సిడీ పొందుతున్నాయని, 2025-26లో ఈ సంఖ్య 21,935కు చేరిందని తెలిపారు. 2019-20 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.183.04 కోట్ల డీజిల్ సబ్సిడీ మత్స్యకారులకు అందించామని వెల్లడించారు.
మత్స్యకార ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా నిలిపివేశారన్న ఆరోపణలను కూడా మంత్రి ఖండించారు. 2024-25లో 63 క్లెయిమ్లకు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 క్లెయిమ్లకు రూ.5.65 కోట్లు చెల్లించామని చెప్పారు.
50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు నెలకు రూ.4 వేల సామాజిక భద్రతా పింఛన్ అందిస్తున్నామని, ఇప్పటివరకు 68,632 మంది లబ్ధిదారులకు రూ.330 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. అలాగే రూ.2,419.61 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. విశాఖపట్నం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందన్నారు.
అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు ముగిశాయని, గణాంకాలు, పారదర్శకత, ప్రత్యక్ష లబ్ధితో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.