Andhra Pradesh Women Welfare: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీలు గౌరవించబడే చోటే దేవతలు కొలువై ఉంటారన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను ఆమె వివరించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, వారిని పురుషులతో సమానంగా నిలబెట్టారని మంత్రి గుర్తు చేశారు. దేశంలోనే మొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. నాటి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని, మహిళలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి ఎదుగుదలకు బాటలు వేశారని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ‘డ్వాక్రా’ సంఘాలు ఊపిరి పోశాయని మంత్రి సవిత అన్నారు. వంటింటి పొగ నుండి మహిళలకు విముక్తి కలిగించేందుకు గతంలో ‘దీపం’ పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు దానిని మరింత విస్తరించి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల విద్యార్థినులు, ఉద్యోగినులు ఎంతో లబ్ధి పొందుతున్నారని, ఇది వారి ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిందని వివరించారు.
మహిళల భద్రత కోసం ‘శక్తి యాప్’ వంటి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని, రాజకీయాల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత క్యాబినెట్లో ముగ్గురు మహిళలకు కీలక శాఖల బాధ్యతలు అప్పగించడమే దీనికి నిదర్శనమన్నారు. మెగా డీఎస్సీ ద్వారా మహిళలు టీచర్ పోస్టులు సాధించేలా ఉచిత శిక్షణ అందిస్తున్నామని, గత ఏడాది సుమారు 11.5 లక్షల మంది మహిళలకు 4 వేల కోట్ల రూపాయల మేర రుణాలు, ప్రయోజనాలు అందజేయడం జరిగిందని ఆమె గుర్తు చేశారు.
ఈ ఏడాది మహిళా దినోత్సవం వేళ మరిన్ని శుభవార్తలు ఉన్నాయని మంత్రి తెలిపారు. మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్తగా 36 ఒప్పందాలను చేసుకుంటోందని, ఇందులో భాగంగా ఎమ్మిగనూరు, చీరాల, రాజాం, పొందూరు ప్రాంతాల్లో నాలుగు ఎన్ఆర్ఎల్ఎం (NRLM) క్లస్టర్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత పునరుద్ఘాటించారు.