AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన మరిన్ని అక్రమ ఆస్తులను ప్రత్యేక విచారణ బృందం (సిట్) తాజాగా గుర్తించింది. అవినీతి సొమ్ముతో తన తల్లిదండ్రుల పేరిట భారీగా భూములు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
విచారణలో తేలిన వివరాల ప్రకారం..తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో రాజ్ కసిరెడ్డి సుమారు రు. 70.36 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారు. అయితే, ప్రభుత్వ కళ్లు కప్పేందుకు రిజిస్ట్రేషన్ పత్రాల్లో వీటి విలువను కేవలం రు. 2.85 కోట్లుగా మాత్రమే చూపించారు. మిగిలిన భారీ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించి ఈ లావాదేవీలు పూర్తి చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించి, తెరవెనుక కోట్లాది రూపాయల ముడుపుల సొమ్మును మళ్లించినట్లు ఆధారాలు లభించాయి.
ఈ అక్రమాస్తుల వివరాలను పరిశీలిస్తే, షాబాద్ ప్రాంతంలో నిందితుడి తల్లి సుభాషిణి పేరిట 17.60 ఎకరాల భారీ భూమి ఉన్నట్లు తేలింది. అలాగే, జనగామలో తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరిట విలువైన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ ఆస్తులన్నీ మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ సంపాదనతోనే కొన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. దీంతో ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది.
ఆస్తుల జప్తు ప్రక్రియలో భాగంగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సిట్ దాఖలు చేయనున్న పిటిషన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతి లభించడంతో, కోర్టు ద్వారా ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది.
ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి చెందిన పలు విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ లోతుగా సాగుతున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుర్తించిన ఈ రూ. 70 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేస్తే, నిందితుడికి గట్టి దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.