TIDCO Houses Tirupati: రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా పుదూరులో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిలిపివేసిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని, 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదన్నదే తమ సంకల్పమని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.50 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు జరగడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చంద్రబాబు కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రెండోసారి భారీ ఎత్తున గృహప్రవేశాలు నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. తిరుపతి జిల్లాలోనే 15,659 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాబోయే డిసెంబర్ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గత వైసిపి ప్రభుత్వంపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నివాస యోగ్యం కాని చోట ఇళ్లు కట్టాలని చూసి పేదలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా, గృహ నిర్మాణ శాఖపై రూ. 816 కోట్ల అప్పు భారం మోపారని మండిపడ్డారు. లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నేరుగా వారి ఖాతాల్లోకే రూ. 174 కోట్లు జమ చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ పాలన సాగుతోందని ఆయన వివరించారు.
ప్రభుత్వ పథకాల అమలుపై స్పందిస్తూ, 'సూపర్ సిక్స్' హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. మొదటి తేదీనే 63 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని, 'తల్లికి వందనం' ద్వారా పిల్లల చదువులకు అండగా ఉంటున్నామని తెలిపారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, మత్స్యకారుల వేట నిషేధ కాలపు భృతిని రూ. 20 వేలకు పెంచామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, అయితే తాము గోదావరి పుష్కరాల లోపే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అనకాపల్లిలో స్టీల్ సిటీ ఏర్పాటు ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అమరావతిని హైదరాబాద్, చెన్నై నగరాల కంటే మిన్నగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేస్తూ 'వాట్సప్ గవర్నెన్స్' వంటి వినూత్న కార్యక్రమాలు తెచ్చామన్నారు. నిన్ననే రాజధానిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, చట్టం అమల్లోకి వచ్చాక అమరావతిని ఎవరూ కదల్చలేరని సీఎం స్పష్టం చేశారు.