- "ఎన్టీఆర్ కాలం నాటి సైనికులకు చంద్రబాబు నీరాజనం": పార్టీ ఆవిర్భావ వేళ అపూర్వ సత్కారం..
- Politics: "సామాన్య కార్యకర్తలను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత టీడీపీదే": కాకినాడ నేత శివరాణి..
Chandrababu: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. పార్టీ స్థాపన నాటి నుండి పసుపు జెండాను భుజాన వేసుకుని నడిచిన సీనియర్ కార్యకర్తలను స్వయంగా ఆహ్వానించి, వారితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ భోజనం చేయడం ఒక అరుదైన అనుభూతిని మిగిల్చింది. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అధినేత తన స్వగృహంలో ఒక కుటుంబ సభ్యుడిలా గౌరవించి ఆత్మీయ విందు ఇవ్వడం 'నభూతో నభవిష్యత్' అని వారు కొనియాడారు. పార్టీ కోసం దశాబ్దాలుగా శ్రమిస్తున్న తమను గుర్తించి, స్వయంగా సత్కరించడం పట్ల కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కోనసీమ జిల్లాకు చెందిన తెలుగు మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పి.రామలక్ష్మి మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుండి తమ కుటుంబం తెలుగుదేశం సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని గుర్తుచేసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసే పార్టీగా టీడీపీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని, ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాల నుంచి విముక్తి లభించినందుకు సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కే. శివరాణి మాట్లాడుతూ, 1982 నుండి పార్టీలో ఉన్న తమ వంటి సామాన్య కార్యకర్తలను గుర్తించి ఉన్నత పదవులు ఇవ్వడం ఒక్క టీడీపీకే సాధ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నివాసంలో దక్కిన ఈ గౌరవం తన జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకమని ఆమె వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మల్లా సూర్యనారాయణ ఈ వేడుకలో తన అనుభవాలను వివరిస్తూ.. పార్టీ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ కాలం నుండి పార్టీలో ఉండి, ప్రస్తుతం మూడో తరం నాయకత్వాన్ని కూడా చూస్తున్నానని, భవిష్యత్ నేత లోకేశ్ గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత ప్రగతి పథంలో నడుస్తుందని ఆయన ఆకాంక్షించారు. విలువలతో కూడిన రాజకీయం చేసే పార్టీ కావడమే టీడీపీ విజయ రహస్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, గౌరవించే సంప్రదాయం కేవలం చంద్రబాబు గారి వద్దే చూస్తున్నామని, ఇది ప్రతి కార్యకర్తలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపిందని ఈ సందర్భంగా విందులో పాల్గొన్న ప్రతినిధులు ముక్తకంఠంతో చాటిచెప్పారు.