ఇలాంటివారి సలహాలు, సహకారం పార్టీకి ఎప్పుడూ అవసరం...
నన్ను రెండు సార్లు ఆదరించిన గుంటూరు పార్లమెంట్ ప్రజలకు కృతజ్ఞుడిని.... వారికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటా... టీడీపీ ను వీడడం లేదు... మళ్లీ రాజకీయాల్లోకి వస్తా... గల్లా జయదేవ్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో గళం విప్పినందుకే తన వ్యాపార సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాయని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. వాటికి భయపడి పార్టీ మారితే తనపై ఎలాంటి వేధింపులూ ఉండేవి కావని వివరించారు. నమ్మిన సిద్ధాంతం కోసం.. గెలిపించిన ప్రజలు, రాజకీయాల్లో అవకాశం కల్పించిన పార్టీ నిర్ణయానుసారం పదేళ్ల రాజకీయ జీవితంలో రాజీ లేకుండా పోరాడానని అన్నారు. గుంటూరు నుంచి వరుసగా రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలుపొందిన జయదేవ్.. రాజకీయాలకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని ఆదివారం గుంటూరులో జరిగిన ఆత్మీయ సభలో వెల్లడించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఇతర నేతలు పాల్గొన్న సభలోను, అంతకుముందు విలేకరులతో ఆయన తన మనోగతాన్ని వివరించారు.
గుంటూరును శక్తివంచన లేకుండా అభివృద్ధి చేశా. రాజకీయాలనుంచి వైదొలగాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. రాజకీయం, వ్యాపారం రెండూ చేయొచ్చనుకున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో రెండింటికీ న్యాయం చేయలేను. 16వేల మంది ఉద్యోగులున్న అమరరాజా విస్తరణకు రాష్ట్రంలో ఇబ్బందులొచ్చాయి. అందుకే తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరణకు చర్యలు చేపట్టాం. విదేశాల్లోనూ బ్రాంచీలు పెట్టాలనే ఆలోచన ఉంది' అని జయదేవ్ వివరించారు. శ్రీరాముడు వనవాసం చేసి ఎంత దృఢంగా వచ్చారో అలాగే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా. పోటీ చేసి గెలుస్తా..' అని ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీగా అనేక స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసి రాష్ట్రానికి, గుంటూరుకు మేలు చేకూరేలా నిధులు తీసుకొచ్చా' అని వెల్లడించారు. రాజకీయాల్లో అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు, లోకేశ్కు ధన్యవాదాలని పేర్కొన్నారు. టీడీపీ ను వీడడం లేదని జయదేవ్, ఆయన తల్లి.. మాజీ మంత్రి అరుణకుమారి స్పష్టం చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వ్యక్తిత్వానికి మారు పేరు జయదేవ్. ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆయన అమరావతి రైతుల తరపున ఉద్యమించిన మొదటి వ్యక్తి. ఆయన పోరాట పంథాకు భయపడి అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పారు. టీడీపీ ఏనాడూ పారిశ్రామికవేత్తల జోలికి వెళ్లలేదు.
పరిశ్రమల స్థాపనను చంద్రబాబు ప్రోత్సహించారు. చిత్తూరు జిల్లాలో రెండే రెండు పరిశ్రమలు.. ఒకటి అమరరాజా, రెండోది హెరిటేజ్. చంద్రబాబు అక్రమ అరెస్టు పర్యవసానాల్ని దిల్లీ నాయకులకు చెప్పటానికి నేను అక్కడికి వెళితే అడుగడుగునా సహకరించిన జయదేవ్ దూరదృష్టి కలిగిన నాయకుడు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో అనర్గళంగా మాట్లాడారు. మళ్లీ పోటీచేస్తే గుంటూరు నుంచి గెలుపొందే అవకాశమున్నా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారంటేనే ఆయన నిబద్ధత అర్థమవుతుంది. ఇలాంటివారి సలహాలు, సహకారం పార్టీకి ఎప్పుడూ అవసరం' అని ఆత్మీయ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన నారా లోకేశ్ పేర్కొన్నారు.
జయదేవ్ విరామం తీసుకోవడం అందరికంటే తనకే ఎక్కువ బాధగా ఉందని ఎంపీ రామ్మోహన్నాయుడు వెల్లడించారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, నన్నపనేని రాజకుమారి, సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు తదితరులు సభలో పాల్గొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి