Andhra Pradesh Economy: 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చేతిలో పైసా లేదు, ఉండటానికి రాజధాని లేదు, ఆదాయం ఇచ్చే హైదరాబాద్ అసలే లేదు. అప్పట్లో అందరూ ఏమన్నారంటే.. "ఏపీ కోలుకోవడానికి మరో 50 ఏళ్లు పడుతుంది, ఇది కేవలం రైతుల రాష్ట్రం" అని కొట్టిపారేశారు. కానీ, పదేళ్ల తర్వాత ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రపంచ కుబేరులు అదానీ, అంబానీ, బిల్ గేట్స్ వంటి వారు ఏపీ తీర ప్రాంతం వైపు క్యూ కడుతున్నారు. ఇది కేవలం కోలుకోవడం కాదు.. పడిలేచిన కెరటంలా సాగిస్తున్న ఒక భారీ ఆర్థిక దండయాత్ర అని చెప్పుకోవాలి.
ఇన్నాళ్లూ ఇంటర్నెట్ అంటే ముంబై, చెన్నై వైపే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు రూటు మారింది. సింగపూర్, అమెరికా నుండి వచ్చే ఇంటర్నెట్ కేబుల్స్ ఇప్పుడు మన విశాఖపట్నం తీరానికి వస్తున్నాయి. ఫేస్బుక్ (మెటా) సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ ల్యాండింగ్ పాయింట్గా వైజాగ్ ని ఎంచుకుంది. ఎక్కడైతే ఇంటర్నెట్ తీరం చేరుతుందో, అక్కడికే ఐటీ కంపెనీలు, డబ్బు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఇప్పుడు రాష్ట్రానికి ఒక 'డేటా గోల్డ్ మైన్'గా మారింది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జపం చేస్తోంది. ఈ ఏఐ సర్వర్లు నడవాలంటే భారీ 'డేటా సెంటర్లు' కావాలి. ముంబై, బెంగళూరులో స్థలం దొరకడం కష్టం, ఉన్నా చాలా ఖరీదు. కానీ ఏపీలో వేల ఎకరాల చదునైన భూమి అందుబాటులో ఉంది. అందుకే గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ వంటి సంస్థలు దాదాపు 98 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ డేటా సెంటర్లను ఇక్కడ కడుతున్నాయి.
డేటా సెంటర్లకు సెకను కూడా పవర్ పోకూడదు. ఎండ ఉన్నప్పుడే సోలార్ పనిచేస్తుంది, గాలి మళ్ళినప్పుడే విండ్ పవర్ వస్తుంది. మరి రాత్రిపూట ఎలా? ఇక్కడే ఏపీ ఒక తెలివైన పని చేస్తుంది. అదే 'పంప్డ్ హైడ్రో స్టోరేజ్'. పగలు మిగిలిపోయిన సోలార్ విద్యుత్తో నీటిని కొండపైకి పంపిస్తారు, రాత్రి పూట ఆ నీటిని కిందకు వదిలి టర్బైన్ల ద్వారా కరెంటు తీస్తారు. ఇదొక పెద్ద గ్రీన్ బ్యాటరీ లాంటిదన్నమాట! దీనివల్ల గూగుల్ లాంటి కంపెనీలకు 24 గంటలు పర్యావరణహిత విద్యుత్ అందుతుంది.
గతంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ‘ఆటోమేటెడ్ ఎస్క్రో సిస్టమ్’ తెచ్చింది. అంటే, ఒక కంపెనీ తన టార్గెట్ పూర్తి చేస్తే, ప్రభుత్వ రాయితీలు ఎవరికీ లంచం ఇవ్వక్కర్లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలో పడిపోతాయి. రాజకీయ నాయకులతో పని లేకుండా సాగుతున్న ఈ పారదర్శకత వల్లే కియా మోటార్స్, ఫాక్స్కాన్ వంటి సంస్థలు ఇక్కడ విస్తరిస్తున్నాయి.
ఐదేళ్లుగా పిచ్చిమొక్కలతో నిండిపోయిన అమరావతిలో ఇప్పుడు మళ్ళీ క్రేన్లు తిరుగుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ నిధులతో పనులు వేగవంతం అయ్యాయి. అయితే ఇది కేవలం భవనాల నగరం కాదు.. దీన్ని ఇండియాలోనే మొదటి క్వాంటం వ్యాలీ గా మార్చాలనేది ప్లాన్. పాత ఐటీ మోడల్తో హైదరాబాద్ను ఢీకొట్టడం కంటే, భవిష్యత్తు టెక్నాలజీ అయిన డీప్ టెక్, ఏఐ రీసెర్చ్ మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. రాష్ట్రంపై ఉన్న 4 లక్షల కోట్ల అప్పు, డేటా సెంటర్లకు అవసరమయ్యే భారీ నీటి వనరులు, రాజకీయ సుస్థిరత వంటివి పెద్ద సవాళ్లు. పాలసీలు మారిన ప్రతిసారీ పెట్టుబడిదారులు భయపడతారు. కాబట్టి, ప్రభుత్వం మారినా అభివృద్ధి ఆగదు అనే నమ్మకాన్ని పెట్టుబడిదారుల్లో కలిగించాల్సి ఉంది. ఒకప్పుడు అన్నీ కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఈరోజు ప్రపంచ ఐటీ పటంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటోంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యం పెద్దదే కావచ్చు, కానీ సాగుతున్న వేగం చూస్తుంటే అది అసాధ్యమేమీ అనిపించడం సందేహమే లేదు. చిమ్మ చీకట్లో నుండి సూర్యోదయ రాష్ట్రం మళ్ళీ వెలుగులు చిమ్మడానికి సిద్ధమవుతుంది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు.