Ambati Rambabu Pushpa Stunt: ‘తగ్గేదే లేదు’ అంటూ అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న
సత్తెనపల్లి లక్కీ డ్రా కేసు ముదిరింది… అంబటి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కోర్టులో చుక్కెదురైంది. (Ambati Rambabu) సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారం ఆయనను చిక్కుల్లోకి నెట్టింది. లక్కీ డ్రా పేరుతో టికెట్లను బలవంతంగా విక్రయించారనే ఆరోపణలపై నమోదైన కేసులో విచారణ జరిపిన స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు, అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోర్టు వద్ద 'పుష్ప' స్టంట్లు..
అంబటి రాంబాబు కోర్టుకు హాజరయ్యే సమయంలో వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విచారణకు వెళ్తూ 'పుష్ప' సినిమా తరహాలో మేనరిజం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంబటి తీరును తప్పుబడుతూ, అవినీతి కేసుల్లో కోర్టుకు వెళ్తూ ఇటువంటి స్టంట్లు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
తగ్గేదే లేదన్న బుద్ధా వెంకన్న
అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. "గడ్డాలు, మీసాలు మీకే కాదు.. మాకూ ఉన్నాయి. మేం కూడా ఎక్కడా తగ్గేది లేదు" అంటూ ఘాటుగా స్పందించారు. అంబటిపై అనేక అవినీతి కేసులు ఉన్నాయని, చట్టం ముందు ఎవరైనా సమానులేనని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అంబటి తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో (Ambati Rambabu Sankranthi Lucky Draw Case) పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, సామాన్య ప్రజలను, వ్యాపారులను టికెట్లు కొనాలని వేధించారనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు లోతుగా విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కోర్టు తాజా నిర్ణయంతో అంబటి రాంబాబు రాజకీయ భవిష్యత్తుపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.