ఖోమ్ టర్బైన్ ప్లాంట్ ధ్వంసం సెంట్కామ్ ప్రకటన
టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం
హర్మూజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ హెచ్చరిక
Iran Israel War Updates: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులను ఉధృతం చేశాయి. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఇరాన్ సైనిక శక్తికి వెన్నెముకగా ఉన్న ఒక కీలకమైన ఇంజిన్ తయారీ కేంద్రాన్ని అమెరికా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ పరిణామంతో అటు గల్ఫ్ దేశాల్లో, ఇటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ తిరుగుబాటు దళాలకు (IRGC) డ్రోన్లు యుద్ధ విమానాల విడిభాగాలను సరఫరా చేసే ఈ ప్లాంట్ దెబ్బతినడం ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్లోని ఖోమ్ ప్రాంతంలో ఉన్న టర్బైన్ ఇంజిన్ తయారీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు జరిగాయి. ఈ ప్లాంట్ ఇరాన్ సైనిక విమానాలకు అవసరమైన గ్యాస్ టర్బైన్ ఇంజిన్లను తయారు చేస్తోంది. దాడులకు ముందు, దాడుల తర్వాత తీసిన శాటిలైట్ ఫోటోలను కూడా అమెరికా విడుదల చేసింది. మార్చి 6న ప్లాంట్ క్షేమంగా ఉన్నట్లు కనిపిస్తుండగా, తాజా దాడుల తర్వాత అక్కడ కేవలం శిథిలాలు మాత్రమే మిగిలి ఉండటం యుద్ధ తీవ్రతను చాటిచెబుతోంది. ఈ దెబ్బతో ఇరాన్ డ్రోన్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడుల పరంపరను కొనసాగిస్తున్నాయి. ఇరాన్ సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. సైనిక శిక్షణా కేంద్రాలు, క్షిపణి నిల్వ చేసే గోడౌన్లు ఇరాన్ నిఘా సంస్థ ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయెల్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల వల్ల తమ దేశంలో రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయని, అందుకే తాము ధీటుగా సమాధానం ఇస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఈ దాడుల శబ్దాలతో టెహ్రాన్ నగరం దద్దరిల్లిపోయిందని అక్కడి మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ దాడుల ప్రభావం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్కే పరిమితం కాకుండా పొరుగున ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ దేశాలపై కూడా పడుతోంది. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను యూఏఈ రక్షణ వ్యవస్థలు గాలిలోనే అడ్డుకున్నాయి. అయితే, ఆ క్షిపణి శిథిలాలు అబుదాబిలోని అల్ షవామెఖ్ ప్రాంతంలో పడటంతో అక్కడ ఉంటున్న ఒక భారతీయుడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అటు ఇరాన్లోని ఉర్మియా ఖొర్రమాబాద్ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో ఒక బాలుడు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించడంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ దేశంలోని విద్యుత్ ప్లాంట్లపై దాడులు జరిగితే, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. అటు భారత ప్రభుత్వం కూడా పరిస్థితిని గమనిస్తోంది. ఇప్పటికే 9 దేశాల గగనతలాల్లోకి భారత విమానాలు వెళ్లొద్దని డీజీసీఏ అడ్వైజరీ జారీ చేసింది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.