ఖార్గ్ ఐలాండ్పై బాంబుల వర్షం
అల్లాడుతున్న గల్ఫ్ దేశాలు
మండిపోతున్న పెట్రోల్ ధరలు
Israel Iran War 2026: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భయంకరంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుం బిగించారు. ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న ఈ మార్గం ద్వారా వ్యాపార నౌకలు సురక్షితంగా వెళ్లేలా చూడటానికి యుద్ధనౌకలను పంపాలని ఆయన మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా బ్రిటన్ వంటి దేశాలు తమ నౌకలను పంపి అమెరికాకు సహకరించాలని ఆయన కోరారు.
కొద్ది గంటల ముందే ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్లోని సైనిక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఆ ద్వీపంలోని సైనిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ ప్రకటించారు. అయితే, మానవతా దృక్పథంతో చమురు శుద్ధి కర్మాగారాల జోలికి వెళ్లలేదని, ఒకవేళ ఇరాన్ గనుక నౌకల రాకపోకలను అడ్డుకుంటే వాటిని కూడా వదలబోమని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తీర ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ శత్రువులకు మాత్రమే ఈ మార్గాన్ని మూసివేస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ ప్రకటించారు. తాజాగా ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) పై డ్రోన్ దాడులు జరిగాయి. ఫుజైరా పోర్టులో చమురు లోడింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. దుబాయ్లోని కొన్ని భవనాలపై క్షిపణి శకలాలు పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ యుద్ధం కారణంగా సుమారు 3,750 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ మార్కెట్పై గట్టిగా పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటేసింది. హోర్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి దేశాలు ఉత్పత్తిని తగ్గించక తప్పలేదు. దీనివల్ల సామాన్యులపై పెట్రోల్ భారం పడే అవకాశం ఉంది. అమెరికాలో కూడా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడంతో ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మాత్రం ఇది "విజయ దశ" లో ఉందని అంటుండగా, ఇరాన్ మాత్రం తన దాడులను తీవ్రం చేస్తోంది. జోర్డాన్, ఇరాక్ వంటి దేశాల్లో కూడా క్షిపణులు పడుతుండటంతో మధ్యప్రాచ్యం మొత్తం నిప్పుల కుంపటిలా మారింది. ఈ ఉద్రిక్తతలు తగ్గకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.