Israel Iran War Updates: ఇరాన్తో కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్యామిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని యుద్ధానికి ముగింపుగా భావించవద్దని, ఇది కేవలం గమ్యం వైపు వెళ్లే క్రమంలో ఒక చిన్న 'స్టాప్' మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నం చేసిన యురేనియం ఆ దేశం దాటి బయటకు వెళ్లాల్సిందేనని, అది చర్చల ద్వారా జరుగుతుందా లేక సైనిక బలంతో సాధించాలా అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని హెచ్చరించారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి ఓడల రాకపోకల కోసం తెరిచారు. అయితే, ఇజ్రాయెల్ లక్ష్యాలు మాత్రం ఇంకా పూర్తి కాలేదని నెతన్యాహు గుర్తు చేశారు. "మా ఆపరేషన్ గిడియన్స్ స్వోర్డ్, ఆపరేషన్ లయన్ రోర్ గనుక నిర్వహించి ఉండకపోతే, ఇరాన్ ఇప్పటికే అణు బాంబులతో ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా చేసేది. ఆ దేశ ఉగ్రవాద పాలనను మేము ఎన్నో ఏళ్లు వెనక్కి నెట్టేశాం" అని ఆయన గర్వంగా ప్రకటించారు.
ఇజ్రాయెల్ సైన్యం ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉందని, తమ వేలు ఎప్పుడూ ట్రిగ్గర్పైనే ఉంటుందని నెతన్యాహు హెచ్చరించారు. అమెరికా ఒత్తిడి వల్లే ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి ఒప్పుకుందని వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. డోనాల్డ్ ట్రంప్తో తనకున్న సాన్నిహిత్యాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇద్దరం ప్రతిరోజూ మాట్లాడుకుంటూనే ఉన్నామని ఆయన వెల్లడించారు.
మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లాపై కూడా దాడులు కొనసాగుతాయని నెతన్యాహు ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీరుట్లో దాడులు జరగడం, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఇరాన్ తన వద్ద ఉన్న క్షిపణులను ఇప్పటికే కోల్పోయిందని, వారి తయారీ సామర్థ్యాన్ని కూడా దెబ్బతీశామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఈ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రానున్న రెండు వారాలు ఇరు దేశాల మధ్య శాంతి కొనసాగుతుందా లేక మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడతాయా అనేది వేచి చూడాలి.