Andhra Telangana Kamma Sangham: భాగ్యనగర వేదికగా నిన్న ఆదివారం (మార్చి 15) సామాజిక సేవే లక్ష్యంగా నిర్వహించిన కమ్మ సంఘాల ఆత్మీయ సమ్మేళనం అత్యంత క్రమశిక్షణతో, స్ఫూర్తిదాయకంగా సాగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత గూడూరు సత్యనారాయణ తన నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సమాజంలోని వివిధ వర్గాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చింది. కేవలం ఒక సామాజిక వర్గ సమావేశంలా కాకుండా, యువతలో సేవా భావాన్ని పెంపొందించే ఒక వర్క్షాప్లా ఈ సభ సాగడం విశేషం.
ఈ సమ్మేళనానికి విదేశీ గడ్డపై తెలుగు వారి ఖ్యాతిని చాటడమే కాకుండా, మాతృభూమిపై మమకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ కోమటి జయరాం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కీలక పదవిలో సత్కరించబడిన జయరాం గారిని, గూడూరు సత్యనారాయణ గారు సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జయరాం గారు మాట్లాడుతూ, సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆ దిశగా గూడూరు చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు.
కార్యక్రమంలో భాగంగా గూడూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న కాకతీయ విద్యా ట్రస్ట్, కమ్యూనిటీ కిచెన్ కార్యకలాపాలను అందరికీ వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు, ఆ వ్యాధి బారిన పడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోగులకు అందిస్తున్న ధన సహాయంపై సభలో చర్చించారు. పేద విద్యార్థుల చదువుల కోసం, ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమాల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ సంస్థల తీరును చూసి ప్రతినిధులందరూ హర్షం వ్యక్తం చేశారు.
సమావేశానికి హాజరైన పలువురు పెద్దలు తమ ప్రసంగాల ద్వారా యువతకు దిశా నిర్దేశం చేశారు. కమ్మ సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు, సంస్థలు చేస్తున్న సేవలను అందరికీ తెలిసేలా చేయడం ద్వారా వందలాది మంది కొత్త సేవకులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలనే ఒక గొప్ప సంకల్పాన్ని ఈ వేదిక ద్వారా చాటి చెప్పారు. సంఘాల మధ్య సమన్వయం ఉంటే సమాజంలో మార్పు తీసుకురావడం సులభమని వారు అభిప్రాయపడ్డారు.
గూడూరు సత్యనారాయణ గారు చేస్తున్న ఈ నిరంతర యజ్ఞానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కమ్మ సంఘాల ప్రతినిధులు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మార్గదర్శిగా నిలవాలని మనసారా ఆకాంక్షించారు. పరమేశ్వరుని ఆశీస్సులతో ఈ సేవా ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనం ముగిసింది.