దెబ్బతిన్న నాయకత్వం.. అయినా తగ్గని పట్టు
పుతిన్ 'చిన్న' సాయం కాదు.. భారీ వ్యూహం!
ట్రంప్ అంచనాలు ఎందుకు తప్పాయి?
Middle East Conflict: మధ్యప్రాచ్యంలో మొదలైన మంటలు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్తో యుద్ధం అంటే కేవలం కొన్ని రోజుల్లో ముగిసిపోయే "చిన్న పర్యటన" అని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. మూడు వారాలు గడుస్తున్నా ఇరాన్ ఏమాత్రం తగ్గకపోగా, అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడికి దిగడం వెనుక రష్యా, చైనాల హస్తం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీతో పాటు 40 మంది కీలక అధికారులను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఆ తర్వాత కూడా వరుసగా ఇరాన్ రక్షణ, నిఘా వర్గాల ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్ చమురు నిల్వలు, గ్యాస్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సాధారణంగా ఏ దేశమైనా ఇలాంటి భారీ నష్టాన్ని చూసి తలవంచుతుంది. కానీ ఇరాన్ మాత్రం పట్టువదలకుండా గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు, హోటళ్లు, అమెరికా స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ తెగింపు వెనుక బలమైన అదృశ్య శక్తులు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్కు కేవలం "కొంచెం" సాయం చేస్తున్నారని ట్రంప్ పైకి చెబుతున్నా, అసలు కథ వేరే ఉంది. రష్యాకు చెందిన 'కనోపస్-వి' శాటిలైట్ ద్వారా అమెరికా యుద్ధ నౌకల కదలికలను ఇరాన్ ఎప్పటికప్పుడు పసిగడుతోంది. కువైట్లోని అమెరికా స్థావరంపై జరిగిన దాడిలో ఆరుగురు సైనికులు మరణించడం వెనుక రష్యా అందించిన కచ్చితమైన సమాచారమే కారణమని తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఎలాగైతే రష్యాకు వ్యతిరేకంగా పని చేసిందో, ఇప్పుడు రష్యా అదే పద్ధతిలో మధ్యప్రాచ్యంలో అమెరికాను ఇబ్బంది పెడుతోంది.
చైనా తన మద్దతును అత్యంత రహస్యంగా కొనసాగిస్తోంది. ఇరాన్కు క్షిపణి తయారీలో వాడే 'సోడియం పెర్క్లోరేట్' అనే కీలక రసాయనాన్ని భారీ స్థాయిలో చైనా సరఫరా చేస్తోంది. అంతేకాకుండా, ఇరాన్ తన క్షిపణులను కచ్చితత్వంతో ప్రయోగించడానికి చైనాకు చెందిన 'బీదూ' శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను వాడుకుంటోంది. అమెరికా ఆంక్షలు ఎన్ని ఉన్నా, ఇరాన్ నుంచి 80 శాతం చమురును చైనా కొనుగోలు చేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా కేవలం చైనా ట్యాంకర్లకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇస్తుండటం వీరి మధ్య ఉన్న లోతైన బంధానికి నిదర్శనం.
యుద్ధం త్వరగా ముగిసిపోతుందని, ఇరాన్ పాలన కుప్పకూలుతుందని ట్రంప్ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. అమెరికా తన సైనిక శక్తిని ఇండో-పసిఫిక్ ప్రాంతం నుండి గల్ఫ్కు తరలించాల్సి వస్తోంది. ఇది చైనాకు ఆసియాలో పట్టు పెంచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది. మరోవైపు, మధ్యప్రాచ్యంలో అమెరికా బిజీగా ఉండటం వల్ల ఉక్రెయిన్కు అందే సాయం తగ్గుతుందని రష్యా ఆశిస్తోంది. యుద్ధం ఎంత కాలం సాగితే అమెరికా అంత బలహీనపడుతుందనేది ఈ రెండు అగ్రరాజ్యాల వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్ వెనుక ఉన్న ఈ 'రష్యా-చైనా కూటమి' ట్రంప్ విదేశాంగ విధానానికి ఒక అగ్నిపరీక్షగా మారింది. కేవలం బాంబుల దాడులతో ఇరాన్ను లొంగదీయడం సాధ్యం కాదని, అక్కడ రాజకీయం అంతకంటే లోతైనదని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి.