New Jersey: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ, అక్కడి ఐటీ దిగ్గజాలను ఏపీ వైపు ఆకర్షిస్తున్నారు. తాజాగా న్యూజెర్సీలో జరిగిన 'ఐటీ సర్వ్' సదస్సులో ఆయన పాల్గొని, వందలాది మంది ఐటీ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీ అయ్యారు. ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను వారికి వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మన్నవ మోహన కృష్ణ గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి విజన్ వల్ల ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఐటీ విప్లవం మొదలైందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ను ఐటీ మ్యాప్లో ఎలా నిలబెట్టారో, ఇప్పుడు ఏపీని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. ముఖ్యంగా గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల రాక, ప్రతిష్టాత్మక 'క్వాంటం వ్యాలీ' ప్రాజెక్టులతో ఏపీ రూపురేఖలు మారిపోబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని మన్నవ హామీ ఇచ్చారు. "మీరు ఏపీకి రండి.. మీ పెట్టుబడులకు, ఆలోచనలకు మా ప్రభుత్వం పూర్తి భద్రత సహకారం అందిస్తుంది" అని మోహన కృష్ణ గారు పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువతకు కొదవ లేదని, వారిని ఐటీ రంగంలో వాడుకోవాలని కోరారు.
మన్నవ మోహన కృష్ణ గారి విజ్ఞప్తికి ఐటీ పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబు గారి నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, రాష్ట్ర అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని సానుకూలంగా స్పందించారు.
న్యూజెర్సీ ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ రమేష్ గార్లపాటి గారు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఐటీ సర్వ్ ప్రతినిధులు, తెలుగు ఎన్నారై పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన్నవ మోహన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి భారీగా ఐటీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన్నవ అమెరికా పర్యటన ఏపీ ఐటీ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందనడంలో సందేహం లేదు.