ఈద్ అల్ అదా వేళ ఖైదీల విడుదలకు యూఏఈ అధ్యక్షుడి ఆదేశాలు..
మానవతా దృక్పథం చాటిన యూఏఈ.. ఖైదీలకు విముక్తి..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బక్రీద్ పండుగ సందర్భంగా మానవతా దృక్పథాన్ని చాటుతూ వేలాది ఖైదీలకు విముక్తి కల్పించారు. దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు యూఏఈలోని సవరణ, పునరావాస కేంద్రాల నుంచి 956 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిపై ఉన్న జరిమానాలు, కోర్టులు విధించిన ఆర్థిక బాధ్యతలను కూడా ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడం, ఖైదీలకు కొత్త జీవితానికి అవకాశం ఇవ్వడం, సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించే మార్గాన్ని కల్పించడమేనని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. బక్రీద్ వంటి పవిత్ర పండుగ వేళ కుటుంబాలతో కలిసి ఉండే అవకాశం కల్పించడం ద్వారా మానవతా విలువలను చాటుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక యూఏఈలోని ఇతర ఎమిరేట్స్లో కూడా ఇదే తరహా క్షమాభిక్ష చర్యలు కొనసాగుతున్నాయి. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వివిధ దేశాలకు చెందిన 836 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
రాస్ అల్ ఖైమాలో 443 మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించగా, అజ్మాన్లో 230 మంది, షార్జాలో 227 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. ఫుజైరాలో మంచి ప్రవర్తన కనబరిచిన 104 మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. ఉమ్ అల్ ఖువైన్లో కూడా పండుగకు ముందు కొంతమంది ఖైదీల విడుదలకు ఆమోదం తెలిపారు.
యూఏఈ నాయకత్వం ఎప్పటికప్పుడు కరుణ, మానవతా భావం, కుటుంబ సమగ్రతకు ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. విడుదల కానున్న ఖైదీలు బక్రీద్ పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేలా అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన బక్రీద్, హజ్ యాత్ర సమయానికే జరగడం ప్రత్యేకతగా భావిస్తారు. ఈ సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం యూఏఈలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయంగా గుర్తించబడుతోంది.