- అమరావతిలో కొత్త అధ్యక్షుల జాబితాను ప్రకటించిన మాధవ్..
- Politics: నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ..
AP BJP leaders: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పక్షాళన చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అమరావతిలో అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. రాబోయే రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ మార్పుల ద్వారా జిల్లాల్లో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై పోరాడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా నియామకాల ప్రకారం, పోలవరం జిల్లా అధ్యక్షుడిగా బుల్లికొండలు దొర, మార్కాపురం జిల్లా బాధ్యతలను పోశం వెంకటకృష్ణారావుకు అప్పగించారు. అలాగే బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మువ్వల వెంకట రమణారావు, అన్నమయ్య జిల్లా పార్టీ పగ్గాలను పులిరెడ్డి నరేంద్ర కుమార్రెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేస్తూ, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు వెంటనే తమ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.