Politics- టీడీపీ కార్యాలయంలో ప్రజాసమస్యల జాతర…
నకిలీ సంతకాలతో పట్టా భూమి మాయం..
దిక్కున్న చోట చెప్పుకో" అంటూ ఆర్టీసీ కండక్టర్ బెదిరింపులు…
Prajavedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం అత్యంత బిజీగా సాగింది. రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ వేధింపులు, అధికారుల నిర్లక్ష్యంపై వచ్చిన ఎనిమిది ప్రధాన ఫిర్యాదులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను నకిలీ పత్రాలతో, సొంత బంధువుల కుట్రలతో కోల్పోయామంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ క్రమంలో అర్జీదారుల సమస్యలను ఆలకించిన నేతలు, నిబంధనల ప్రకారం విచారణ జరిపి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మొదటి కేసులో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన పద్మలత అనే మహిళ తన వారసత్వ పట్టా భూమి మాయమైందని వాపోయింది. స్థానిక మాజీ సర్పంచ్, అతని అనుచరులు తమ ప్రమేయం లేకుండానే నకిలీ సంతకాలను సృష్టించి రెవెన్యూ రికార్డులను మార్చేశారని ఆరోపించింది. సర్వే నెంబర్లు 188, 189/2 లోని తమ భూములను అక్రమంగా 'గ్రామకంఠం' కిందకు మార్చి, ఆ తర్వాత వారి పేర్ల మీదకు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ఆధారాలతో సహా చూపించింది. అధికారిక రిజిస్ట్రేషన్ కాపీలను నేతలకు సమర్పించిన ఆమె, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
మరో వివాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లికి చెందిన పాశం రవి తన భూమి ఆన్లైన్ ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశాడు. సర్వే నెంబర్ 938/38 లోని తన తండ్రి ద్వారా వచ్చిన ఒక ఎకరం వ్యవసాయ భూమిని యాళూరి మర్రిరెడ్డి, యాళూరి తిరుపతిరెడ్డి అనే వ్యక్తులు అక్రమంగా వారి పేర్ల మీదకు ఆన్లైన్ చేయించుకున్నారని తెలిపాడు. ఇందులో మర్రిరెడ్డి గిద్దలూరు డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తూ, తనకున్న పలుకుబడితో "దిక్కున్న చోట చెప్పుకో, ఆన్లైన్ లో పేర్లు తీసేయబోం" అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయాడు.
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాలి గ్రామానికి చెందిన బసాని వీర్ల వెంకమ్మ తన మరిది వేధింపులపై ఫిర్యాదు చేసింది. 1976 లో తన తండ్రి కాకిలిగడ్డ ధర్మరాజు పసుపు-కుంకుమల కింద ఇచ్చిన 35 సెంట్ల భూమిపై ఆమె మరిది భవానీ పూర్ణచంద్రరావు కన్ను వేశాడని తెలిపింది. ఆ ఆస్తిపై ఎలాంటి హక్కు లేకపోయినా, తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తూ ప్రాణాపాయం కలిగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
అన్నదమ్ముల మధ్య దారి వివాదం కారణంగా పంటలు వేసుకోలేకపోతున్నానని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మంగోల్లుకు చెందిన నంబూరి లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రి పంచి ఇచ్చిన 1.60 ఎకరాల భూమిలో తన పొలానికి వెళ్లే దారిని అన్నదమ్ములు నంబూరి పాపారావు, వెంకటేశ్వర్లు బాబు అడ్డుకుంటున్నారని తెలిపాడు. అంతేకాకుండా తమ ఇంటిపై దాడికి యత్నించిన వీడియో ఆధారాలను 2024 డిసెంబర్ లోనే పోలీసులకు ఇచ్చినప్పటికీ, వత్సవాయి పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం కమ్మ పల్లెకు చెందిన పద్మావతి అనే పేద మహిళ భూమి కోసం చేసిన ఖర్చుల వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపింది. 2014లో ప్రభుత్వం ఇచ్చిన 2 సెంట్ల నివాస స్థలాన్ని చినగానిపల్లికి చెందిన తోటి అక్కులప్ప, అతని భార్య నరసమ్మ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసి, మధ్యవర్తులతో రూ. 60,000 ఇచ్చి రాజీ పడినప్పటికీ, మళ్లీ సరిహద్దు బండలను కూల్చివేసి బెదిరింపులకు దిగుతున్నారని, తమకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టింది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం అడవి బూదగూరుకు చెందిన మల్లిగాకుప్పన్ తన 2.33 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ బుక్ మంజూరు చేయాలని కోరాడు. తాము 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి రికార్డులలో 'మిగులు భూమి'గా నమోదైందని, దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాడు. దీనితో పాటు తన భర్త తమిళనాడుకు చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, తన తల్లిగారి ద్వారా దక్కిన 0.70 సెంట్ల భూమిలో 0.30 సెంట్లను అక్రమంగా ఆక్రమించాడని మంత్రికి ఫిర్యాదు చేశాడు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల సొంత తమ్ముడిని నమ్మి మోసపోయానని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్లకు చెందిన రామయ్య వాపోయాడు. బ్యాంకు లోన్ కోసం తన ఇంటిని తమ్ముడు కంచేటి వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ చేయించగా, లోన్ కింద వచ్చిన రూ. 2,00,000 డబ్బులను తమ్ముడు తనకే సొంతం చేసుకున్నాడని తెలిపాడు. ఒప్పంద పత్రాలు ఉన్నప్పటికీ డబ్బులు ఇవ్వకుండా గొడవకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో కేసులో పల్నాడు జిల్లాకు చెందిన రామావత్ శ్రీను నాయక్, పాడేరు ఆర్డీఓ ఆఫీసులో నిలిచిపోయిన తన భూమి రిజిస్ట్రేషన్ ఫైలును క్లియర్ చేయాలని కోరారు. వీరితో పాటు అనేకమంది పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణం మరియు అనారోగ్య సాయం కోసం నేతలకు వినతులు సమర్పించారు.