ఆత్మకూరులో సాగునీరు, తాగునీటి పనులపై మంత్రి ఆనం సమీక్ష..
ఖరీఫ్కు ముందే ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశం..
ఆత్మకూరు: ముఖ్యమంత్రి స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.
శుక్రవారం ఆత్మకూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రి ఆనం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీరు, తాగునీరు, మున్సిపల్ అభివృద్ధి, ఇరిగేషన్ పనులు తదితర అంశాలపై విపులంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పనితీరు విషయంలో నెల్లూరు జిల్లా ముందువరుసలో ఉండటం గర్వకారణమన్నారు. జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ప్రశంసించడం జిల్లా అధికారులకు ప్రోత్సాహంగా నిలిచిందన్నారు.
సాగునీటి అంశాలపై సోమశిల, తెలుగు గంగ, నీటి పారుదల శాఖల పనితీరును మంత్రి సమీక్షించారు. రాబోయే ఖరీఫ్ సీజన్కు ముందే కాలువల మరమ్మత్తులు, కొనసాగుతున్న పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సైక్లోన్ రిలీఫ్, ఎఫ్డీఆర్ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.
సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన ఉత్తర, దక్షిణ కాలువల పనుల్లో ఉన్న సమస్యలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మైనర్, మీడియం ఇరిగేషన్ కింద రూ.3212 కోట్ల వ్యయంతో 440 పనులు మంజూరయ్యాయని, వాటిలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
జలజీవన్ మిషన్ కింద రూ.6588 కోట్లతో 336 తాగునీటి పనులు అమలులో ఉన్నాయని మంత్రి తెలిపారు. వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీపీడబ్ల్యూఎస్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాల కింద ఉన్న స్కీములను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఆదేశించారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.36 కోట్లతో రహదారులు, డ్రైన్లు, అమృత్ పథకం కింద మంచినీటి పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్కు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తైందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవడమే లక్ష్యమన్నారు.
ప్రస్తుతం 23 వార్డులు ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీని 28 వార్డులుగా విస్తరించే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆత్మకూరు అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.