“ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రారంభం..
శ్రీకాకుళం అభివృద్ధికి భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం..
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ పరిశుభ్రత, ఉత్తరాంధ్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపు నుంచి భారీ పరిశ్రమల ఏర్పాటు వరకు పలు అంశాలపై ఆయన తన ప్రభుత్వ ప్రణాళికలను ప్రజలతో పంచుకున్నారు.
గ్రామాల్లో మురుగునీరు, వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండకుండా “మ్యాజిక్ డ్రైన్లు” నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి ఇంటి పరిసరాలు మాత్రమే కాకుండా, మనం తిరిగే రహదారులు కూడా పరిశుభ్రంగా ఉండాలనే సంస్కృతి ప్రజల్లో పెరగాలని కోరారు. గతంలో తాను చేసిన పాదయాత్రలో గ్రామాలు, పట్టణాల చివరల్లో పెద్ద ఎత్తున చెత్త కనిపించేదని గుర్తుచేసుకున్నారు. అప్పుడే రాష్ట్రాన్ని శుభ్రంగా మార్చాలని నిర్ణయించుకుని “స్వచ్ఛపథం” కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. పంచాయితీల్లో అత్యుత్తమ విధానాలు అమలు చేయడం వల్ల జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లా కందులవారిపల్లె, కాణిపాకం వంటి పంచాయితీలు మంచి పనితీరుతో గుర్తింపు తెచ్చుకున్నాయని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని శాఖకు జాతీయ స్థాయిలో ఎనిమిది అవార్డులు రావడం ఆనందకరమని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛత అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల ప్రత్యేక పరిశుభ్రత డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు వారాల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు కూడా స్వచ్ఛతా అవార్డులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడిన సీఎం, ఈ ప్రాంతాన్ని పరిశ్రమలు, ఐటీ, డేటా సెంటర్ల హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విశాఖకు గూగుల్ కంపెనీ రానుండగా, రాయలసీమకు ఫైటర్ జెట్ ప్లాంట్ తీసుకువచ్చామని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లే పరిస్థితి కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
పోర్టులు, ఎయిర్పోర్టులు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని సీఎం వివరించారు. రిలయన్స్ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందని, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టును జూలైలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మూలపేట పోర్టు ద్వారా కనెక్టివిటీ పెరుగుతుందని, పలాసలో మరో ఎయిర్పోర్టు నిర్మాణంపై కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై కూడా సీఎం కీలక ప్రకటనలు చేశారు. మద్దువలస స్టేజ్-2ను 2027 జనవరిలో, హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని 2027 ఏప్రిల్లో, వంశధార ఫేజ్-2 స్టేజ్-2ను 2027 జూలైలో పూర్తి చేస్తామని చెప్పారు. జంఝావతి ప్రాజెక్టును కూడా 2027 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నేరడి బ్యారేజీని వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర రాజకీయాలపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని, వైసీపీ ప్రభుత్వం టెర్రరిజం సృష్టించిందని ఆరోపించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడును అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను 22ఏలో పెట్టి భయాందోళనలు సృష్టించారని అన్నారు.
రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ప్రచారం ఎక్కువైందని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంచనాల ప్రకారం ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. “బాబాయిని గొడ్డలితో చంపి, నా చేతిలో గొడ్డలి పెట్టారు” అంటూ గత ఘటనలను గుర్తుచేశారు. ప్రజలను మోసం చేసే డ్రామాలతో మళ్లీ ముందుకు వస్తున్నారని అన్నారు.
చివరగా, “ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమం, పరిశుభ్రత – ఈ మూడు దిశల్లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది” అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.