ఎబోలా వ్యాప్తిపై అప్రమత్తమైన డీజీసీఏ.. విమానయాన సంస్థలకు కొత్త మార్గదర్శకాలు..
ఎబోలా లక్షణాలపై విమానాల్లో ప్రత్యేక ఆరోగ్య ప్రకటనలు తప్పనిసరి..
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో భారత్లో కూడా అప్రమత్త చర్యలు ప్రారంభమయ్యాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి తీవ్రరూపం దాల్చడంతో, దీనిని “అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి”గా WHO ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) విమానయాన సంస్థలకు కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఎయిర్లైన్స్ తప్పనిసరిగా ప్రయాణికుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. ప్రయాణికులు విమానం దిగే ముందు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఎబోలా లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
విమాన ప్రయాణ సమయంలో ఆరోగ్య హెచ్చరికలు ప్రసారం చేయడం కూడా ఇప్పుడు తప్పనిసరి చేశారు. జ్వరం, బలహీనత, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. భారత్కు చేరుకున్న తర్వాత కూడా ఇమ్మిగ్రేషన్ లేదా వైద్య అధికారులను సంప్రదించాలని సూచనలు జారీ చేశారు.
అలాగే భారత్కు వచ్చిన తర్వాత 21 రోజుల లోపు ఎబోలా లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సంబంధిత ఎయిర్పోర్ట్ హెల్త్ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీజీసీఏ పేర్కొంది. విమానంలోనే ఎవరైనా అనుమానిత లక్షణాలతో కనిపిస్తే వారిని వెంటనే విమానం వెనుక భాగానికి మార్చాలని SOPలో పేర్కొన్నారు. వీలైతే ఆ ప్రయాణికుడి ముందు మూడు వరుసల సీట్లు, పక్క సీట్లను ఖాళీగా ఉంచాలని సూచించారు.
ఇక విమానయాన సంస్థలు తగినంత మోతాదులో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లోవ్స్, పీపీఈ కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు, బయో హాజర్డ్ వ్యర్థ సంచులు సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంటున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.