చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి..
ప్రెస్ మీట్లకే పరిమితమైన హనీమూన్ నాయకుడు జగన్: మంత్రి వ్యాఖ్యలు..
తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల నేపథ్యంలో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన సంక్షేమ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి, గతంలో ఆర్థికంగా, పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రాన్ని కేవలం 24 నెలల్లోనే అభివృద్ధి దిశగా తీసుకెళ్లామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి అఖండ మద్దతు ఇచ్చారని, ఆ విశ్వాసానికి తగ్గట్టుగానే ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి సుమారు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్పై మండిపడ్డ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, “జగన్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమైన హనీమూన్ నాయకుడు” అంటూ విమర్శించారు. గత 24 నెలల్లో అరుదుగా మాత్రమే ప్రజల ముందుకు వచ్చారని, ప్రతి సారి పాత విషయాలనే కొత్తగా చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.
ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్, తన కుటుంబ సభ్యుల మరణాలపై చంద్రబాబును విమర్శించడం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు శాంతియుత రాజకీయాలకు ప్రతీక అని, అభివృద్ధి తప్ప ఆయనకు మరొకటి తెలియదని చెప్పారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయనను ఎన్నుకోవడం వెనుక అదే నమ్మకం ఉందన్నారు.
వైఎస్ కుటుంబ చరిత్రను ప్రస్తావిస్తూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా మంగంపేట బైరటీస్ మైన్స్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే వైఎస్ కుటుంబం రాజకీయ, ఆర్థికంగా ఎదిగిందని ఆరోపించారు. విజయలక్ష్మి మినరల్స్ పేరుతో జరిగిన అక్రమాలపై అప్పట్లో అసెంబ్లీ హౌస్ కమిటీ నివేదిక కూడా వచ్చిందని గుర్తు చేశారు. అదే అక్రమ సంపాదనతో సందూర్ పవర్, భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా వంటి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించబడ్డాయని ఆరోపించారు.
రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా హత్యా రాజకీయాలను ప్రవేశపెట్టింది వైఎస్ కుటుంబమేనని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ ఘటన వెనుక ఉన్న ఆస్తి వివాదాల గురించి మాట్లాడినందుకు తమపై లీగల్ నోటీసులు పంపారని తెలిపారు. అయినప్పటికీ నిజాలు చెప్పడంలో వెనుకడుగు వేయబోమన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిపోయిందని మంత్రి పేర్కొన్నారు. గతంలో పెద్ద కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని, ఇప్పుడు దేశ విదేశాల పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన చంద్రబాబు, ఇప్పుడు అమరావతిని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పల్లెబాట’, ‘రచ్చబండ’ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ‘సంజీవిని’ వంటి ఆరోగ్య కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఎండల తీవ్రత మధ్య కూడా రోజుకు 18 గంటలు పని చేస్తూ ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు చంద్రబాబేనని కొనియాడారు.
జగన్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై చర్చించాలని మంత్రి సూచించారు. “మీకు మైక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంచి సూచనలు చేస్తే స్వీకరిస్తాం. కానీ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాలతో ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల మీకే నష్టం” అని వ్యాఖ్యానించారు.
మహానాడు గురించి మాట్లాడుతూ, అది కేవలం పార్టీ కార్యక్రమం కాదని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు జరుపుకునే పండుగ అని చెప్పారు. అలాంటి వేళ జగన్ కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదమని అన్నారు. “తెలుగుదేశం పార్టీకి కోటి 20 లక్షల మంది క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. మా సంబరాలను ఆపడం ఎవరి వల్ల కాదు” అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.