ఈ భేటీలో పాల్గొన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బహరైన్ దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు..
గల్ఫ్ లో యుద్ధ పరిస్థితుల పై సీఎం ఆరా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలతో ఆత్మీయంగా సమావేశమై, వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవడం తన పాలనలో ముఖ్య భాగమని చెబుతూ సీఎం ఈ సమావేశాన్ని మరింత సార్థకంగా మార్చారు.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బహరైన్ దేశాలకు చెందిన పలువురు ప్రవాసాంధ్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు. సమావేశానికి వచ్చిన అతిథులను సీఎం హృదయపూర్వకంగా ఆహ్వానించి, వారు నివసిస్తున్న దేశాల్లో పరిస్థితులు, వారి ఉద్యోగాలు, కుటుంబాల గురించి విచారించారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ నుండి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా కు నియమించబడ్డ శ్రీనివాస్ మిరియాల తో పాటు ఆ పార్టీ ఐటి విభాగ ప్రతినిధి లీల కోటేష్ బాబు తోపాటు కెనడ నుండి భరత్ సాయి, ఆస్ట్రేలియా నుండి నరేంద్ర బాబు, శ్రీ హరి, ఈదర తన్మయి, బహరైన్ నుండి ఆరే అనిల్, ఆరే హిమ శ్రావణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను బహరైన్ నుంచి వచ్చిన ప్రతినిధులు వివరించారు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల ప్రభావం అక్కడ ఉన్న నివాసితులపై ఎలా ప్రభావం చూపుతుందా అని ముఖ్యమంత్రి లోతుగా అడిగి తెలుసుకున్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర అభివృద్ధిపై కూడా చర్చలు సాగాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నారైలు తెలిపారు. ప్రభుత్వం సరైన ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. అలాగే విదేశీ అవకాశాలను తెలుగు యువత వినియోగించుకునేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఎన్నారైల సూచనలను సానుకూలంగా స్వీకరించిన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో బలమైన అనుబంధం నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని కోరుతూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
అలాగే జనసేన పార్టీ తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి గా ఎన్నికైన శ్రీనివాస్ మిరియాల ను అభినందిస్తూ, కూటమి కార్యకర్తలు అందరూ కలిసి పాటుపడాలని, ఎంతో కస్టపడితే వచ్చిన అమరావతి శాశ్వత స్థానం గురించి ఎన్నారైలకు వివరించారు. ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకుని మాట్లాడే అవకాశం దక్కడం తమకు ప్రత్యేక అనుభూతి అని ఎన్నారైలు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం మరియు ప్రవాసాంధ్రుల మధ్య బంధం మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమైంది.